డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్పేకు కీలక దెబ్బ తగిలింది. త్వరలో ఐపీఓకు వెళ్లాలని సన్నాహాలు చేస్తున్న ఈ సంస్థపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రూ.21 లక్షల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) నిబంధనలను ఉల్లంఘించిందన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫోన్పే నిర్వహిస్తున్న ఎస్క్రో ఖాతాలో రోజువారీగా ఉండాల్సిన నిల్వలు, కస్టమర్లు మరియు వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తానికి తగ్గుగా ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా ఈ లోటు విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావడంలో కూడా ఫోన్పే విఫలమైందని పేర్కొంది. దీంతో పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ చట్టం-2007 కింద జరిమానా విధించామని స్పష్టం చేసింది.
2023 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు ఫోన్పే కార్యకలాపాలపై ఆర్బీఐ విస్తృత తనిఖీలు జరిపింది. ఈ క్రమంలో ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఫోన్పే సమాధానం ఇచ్చినా, విచారణ తర్వాత సరైన న్యాయపరమైన ఆధారాలు లేకపోవడంతో ఈ నెల 10న రూ.21 లక్షల జరిమానా విధించడాన్ని తుది నిర్ణయంగా తీసుకుంది.
అయితే, ఈ చర్య నియంత్రణాపరమైనదే గానీ వినియోగదారుల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దేశంలో యూపీఐ మార్కెట్లో 48.64% వాటాతో ఫోన్పే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో ఐపీఓకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న దశలో ఆర్బీఐ జరిమానా విధించడం పరిశ్రమలో విస్తృత చర్చనీయాంశమైంది.