ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే దేశంలో ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో నడిచే తొలి బంగారు గనిని ప్రారంభించబోతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ బంగారు గని ఏర్పాటైంది. నవంబర్ 2025లో ఉత్పత్తి అధికారికంగా ప్రారంభం కానుంది. రూ.320 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి సుమారు 500 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుగ్గలి మండలంలోని బొల్లవానిపల్లి గ్రామం దగ్గర ఉన్న ఈ ప్లాంట్ పూర్తిగా పనిచేస్తే, స్థానికంగా 350 మందికి నేరుగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
ఈ గని ప్రాజెక్ట్ దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బంగారం ఉత్పత్తి యూనిట్గా గుర్తింపు పొందుతోంది. ప్రస్తుతం ప్లాంట్లో ట్రయల్ రన్ జరుగుతోంది. జియో మైసూర్ సంస్థకు బంగారం, వెండి వంటి ఖనిజాల తవ్వకాల్లో విస్తృత అనుభవం ఉంది. సంస్థ ప్రధాన వాటాదారు ప్రభాకరన్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, బంగారం ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వ సహకారంతో, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయి, అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది.
ఈ గని ఏర్పాటుకు సుమారు 19 సంవత్సరాల ప్రణాళిక, అనుమతులు, నిర్మాణం పట్టింది. 2006లో జియో మైసూర్ సంస్థకు 1477 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులు లభించాయి. మొదటగా ఒక చిన్న మినీ ప్లాంట్ నిర్మించి బంగారం నాణ్యతను పరీక్షించారు. తవ్వకాల ఫలితాలు సానుకూలంగా రావడంతో పూర్తిస్థాయి ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. సంస్థకు దేశవ్యాప్తంగా ఖనిజ తవ్వకాల్లో 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అనుభవం ఉంది. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి ప్రాంతాల్లో బంగారం నిల్వలు ఉన్నట్లు సర్వేల్లో తేలింది.
జియో మైసూర్ సంస్థకు 2043 వరకు తవ్వకాలకు ప్రభుత్వ అనుమతి ఉంది. అదనంగా మరో 50 సంవత్సరాలపాటు తవ్వకాలను కొనసాగించడానికి కూడా ముందస్తు అనుమతులు పొందింది. సర్వే ప్రకారం, భూమి లోపల సుమారు 180 మీటర్ల లోతులో 6.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉందని గుర్తించారు. ఈ ఖనిజాన్ని శుద్ధి చేస్తే వెయ్యి టన్నులకు 700 గ్రాముల బంగారం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రారంభ దశలో రోజుకు వెయ్యి టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తూ ఉత్పత్తి ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఏడాదికి వెయ్యి కిలోల బంగారం ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచే ప్రణాళిక ఉంది.
ఈ గని కోసం నీటి అవసరాలను తీర్చేందుకు హంద్రీ–నీవా కాలువ నుంచి 18 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ ఏర్పాటు చేశారు. ఈ పైప్లైన్ ద్వారా ప్లాంట్కు నిరంతర నీటి సరఫరా జరగనుంది. ఈ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లాలో ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. బంగారం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తోందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.