ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం, దివ్యాంగుల పింఛన్ల జారీలో అక్రమాలు వెలుగులోకి రావడంతో కఠిన చర్యలకు సిద్ధమైంది.
వైకల్యం తక్కువగా ఉన్నవారు, ఎక్కువగా ఉన్నట్లు తప్పుడు సర్టిఫికెట్లు చూపించి పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, అనర్హులను గుర్తించేందుకు ఫిబ్రవరి నుంచి సదరం శిబిరాల ద్వారా పునఃపరిశీలన చేపట్టింది. వైకల్యం శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారిని గుర్తించి, నోటీసులు జారీ చేసింది.
అయితే కొంతమంది లబ్ధిదారులు శిబిరాలకు హాజరుకాకపోవడంతో ఆగస్ట్ నెలలో వారికి పింఛన్లు నిలిపివేశారు. కొంతమంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల సాయంతో మళ్లీ రిపోర్ట్ చేయించుకొని పింఛన్లు పొందారు. మరికొందరు నోటీసులకు స్పందించకపోవడంతో, వారికి రెండోసారి నోటీసులు పంపారు.
ఇదిలా ఉంటే, సదరం కేంద్రాల్లో వైకల్య పరీక్షలు పూర్తయినా, ఆన్లైన్ అప్డేట్ ఆలస్యం కారణంగా కూడా ఆగస్ట్లో కొందరికి పింఛన్లు అందలేదు. వైద్యుల కొరత, ఇతర కారణాలతో కొన్ని చోట్ల పునఃపరిశీలన ఆలస్యమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అనర్హులను తొలగించి, మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.