భారత్ సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్కు గట్టి గుణపాఠం చెప్పిందని భారత వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్థాన్కు చెందిన ఆరు విమానాలను కూల్చివేసినట్టు ఆయన ధ్రువీకరించారు. వీటిలో ఐదు ఫైటర్ జెట్లు, ఒక కీలక నిఘా విమానం (అవాక్స్) ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందిన ఘటనకు ప్రతిస్పందనగా మే 7న ఈ ఆపరేషన్ ప్రారంభించామని ఆయన వివరించారు. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకొని, వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆపరేషన్లో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. “మా ఎస్-400 వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. దాని పరిధి కారణంగా పాక్ విమానాలు మా గగనతలంలోకి చొరబడలేకపోయాయి. దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోనే భారీ నిఘా విమానాన్ని కూల్చివేశాం. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించి సాధించిన అతిపెద్ద విజయం” అని ఆయన పేర్కొన్నారు. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయమైన బహవల్పూర్పై జరిపిన దాడిలో పక్క భవనాలకు ఎలాంటి నష్టం కలగకుండా, లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేశామని ఆయన ఉపగ్రహ చిత్రాలతో చూపించారు.
నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో వాయుసేనతో పాటు ఆర్మీ, నేవీ కూడా సమన్వయంతో పనిచేశాయని ఆయన వివరించారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, ఇతర అధునాతన ఆయుధాలను సమర్థంగా వినియోగించడంతో పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చిందని చెప్పారు. “ఇది కేవలం ప్రతీకార దాడి మాత్రమే కాదు… కచ్చితత్వం, వృత్తి నైపుణ్యం, నిర్దిష్ట లక్ష్యంతో నిర్వహించిన ఆపరేషన్” అని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ భారత్ సైనిక శక్తిని, వ్యూహాత్మక పటిమను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిందని ఆయన అన్నారు.