సికింద్రాబాద్లో రాబోయే కాలంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలిచే ఒక భారీ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్కు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరవాసులతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయాణించే వాహనదారులకు ఎంతో సౌకర్యం కలగనుంది. ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయే సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది.
ఈ ఎలివేటెడ్ కారిడార్ 18.170 కిలోమీటర్ల పొడవులో నిర్మించనున్నారు. ఇందులో 11.65 కిలోమీటర్ల భాగం పూర్తిగా స్టీల్తో నిర్మించబడుతుంది. దీని వల్ల ఇది దేశంలోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జ్గా రికార్డు సృష్టించనుంది. అధికారులు దీన్ని వేగంగా, పటిష్టంగా పూర్తి చేసేలా కాంక్రీట్ పునాదులపై మొత్తం వంతెనను స్టీల్ నిర్మాణంతో డిజైన్ చేశారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.2,232 కోట్లు అవుతుందని హెచ్ఎండీఏ అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.
ఈ కారిడార్ ప్యారడైజ్ నుంచి వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్పేట వరకు సాగనుంది. ముఖ్యంగా హకీంపేట ఆర్మీ ఎయిర్పోర్టు సమీపంలో 450 మీటర్ల అండర్గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. ఆ తర్వాత సుమారు ఆరు కిలోమీటర్ల రహదారిని ఆరు లైన్లతో విస్తరించనున్నారు. దీంతో ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే సికింద్రాబాద్ నుంచి బయటకు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గిపోవచ్చు.
ప్రస్తుతం టెండర్లు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ఆహ్వానించారు. ఈ విధానంతో పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు నమ్ముతున్నారు. మొత్తం కారిడార్ పూర్తి కాగానే హైదరాబాద్ అభివృద్ధి చరిత్రలో ఇది ఒక మైలురాయి ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతతో నిర్మించబోయే ఈ స్టీల్ బ్రిడ్జ్ భవిష్యత్తులో దేశానికి గర్వకారణం కానుంది.