ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపట్టింది. ఆర్డీఎస్ఎస్ పథకం కింద డిస్కంలు ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటులో నిమగ్నమయ్యాయి. దీని వల్ల విద్యుత్ నష్టాలు తగ్గి, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. లెక్కల ప్రకారం ఏటా రూ.851 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఒక కిలోమీటర్ ఫీడర్ విభజనతో పాటు అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే యూనిట్కు 4 పైసల చొప్పున విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గనుంది. చిన్న మార్పులతోనే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చని అధికారులు విశ్లేషిస్తున్నారు.
వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయడం ఈ ప్రణాళికలో ప్రధాన అంశం. మొత్తం 5,783 ఫీడర్లను విభజించే ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 417 ఫీడర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని వేగంగా పూర్తి చేయాలని డిస్కంలు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తూ.. ఇళ్లకు, చిన్న పరిశ్రమలకు అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.
11 కేవీ, 33 కేవీ ఫీడర్లపై ఎక్కువ లోడ్ ఉండటం వల్ల తరచూ కరెంట్ సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల నష్టాలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫీడర్లను విభజిస్తున్నారు. ప్రస్తుతం 938 ఫీడర్లు అధిక లోడ్తో ఉన్నాయి. అందువల్ల వాటిని విభజించడం ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పించి, విద్యుత్ అంతరాయం తగ్గించవచ్చని డిస్కంలు భావిస్తున్నాయి.
మునుపటి ప్రభుత్వంలో ఆర్డీఎస్ఎస్ పనులు నత్తనడకన సాగగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. ప్రస్తుతం 40-50 శాతం పనులు పూర్తయి, మిగిలినవి ఈ ఏడాదిలో పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధమైంది.