కదులుతున్న రైలులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపేశారు. రైలు ఆగగానే ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగి పరుగులు పెట్టారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గేటు సమీపంలో ఈ రోజు ఉదయం జరిగింది.
ప్రయాణికులు, రైల్వే అధికారులు అందించిన వివరాల ప్రకారం… చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గంగా–కావేరి ఎక్స్ప్రెస్ (12670) లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్కు వెంటనే ఉన్న బోగీలో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో బోగీలో ఉన్నవారు తీవ్ర భయానికి గురయ్యారు.
ఘటనతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైలును నిలిపారు. ప్రయాణికులు వెంటనే కిందకు దిగి బోగీకి దూరంగా పరుగులు పెట్టారు. మంటల కారణం బ్రేక్ బైండింగ్ కావచ్చని గుర్తించిన సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. దాదాపు అరగంట తర్వాత రైలు మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.