ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. ఈ-క్రాప్ బుకింగ్ మరియు ఈ-కేవైసీ ప్రక్రియలను తప్పనిసరిగా సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలి అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ఈ గడువు ముగిసిన తర్వాత రైతులు పథకాల ప్రయోజనాలను పొందలేరని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ క్రాప్ డేటా తప్పనిసరి కాబట్టి రైతులు ఆలస్యం చేయకుండా నమోదు పూర్తి చేయాలని సూచించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలోని 2.61 కోట్ల ల్యాండ్ పార్శిళ్లలో కేవలం 8 శాతం మాత్రమే ఈ-క్రాప్ బుకింగ్ పూర్తి అయిందని అధికారులు వెల్లడించారు. అంటే సుమారు 21 లక్షల ల్యాండ్ పార్శిళ్లలో మాత్రమే పంట నమోదు జరగడంతో ఢిల్లీ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి రైతు సేవా కేంద్రం రోజుకు కనీసం 50 ల్యాండ్ పార్శిళ్లలో నమోదు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే మార్గదర్శకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సర్వేలో ఏవైనా తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రావు హెచ్చరించారు. ముఖ్యంగా సాగు రకాల వివరాలు, పంట విస్తీర్ణం తప్పుగా నమోదు చేస్తే రైతులకు సమస్యలు వస్తాయని చెప్పారు. సాగుకు అనువైన భూములు మాత్రమే నమోదు చేయాలని, అననుకూల భూములను తొలగించాలని సూచించారు. ఈసారి అరటి, కొబ్బరి, మామిడి పంటలను కూడా జియో ఫెన్సింగ్ విధానంలో నమోదు చేసి వాటి ఫోటోలు అప్లోడ్ చేయనున్నారు.
ఈ క్రాపింగ్ ప్రక్రియలో వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన పంటలకు హార్టికల్చర్ అధికారులు బాధ్యత వహించాలి. ప్రభుత్వ భూములు, సాగుకు పనికిరాని భూముల విషయంలో మండల తహసీల్దార్ పరిశీలన చేస్తారని తెలిపారు. రైతుల పంటల సాగు సమాచారం, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లను సక్రమంగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
రైతులు తమ పంటల వివరాలను ఆలస్యం చేయకుండా నమోదు చేస్తే మాత్రమే ప్రభుత్వం అందించే పథకాల సాయం సమయానికి అందుతుంది. ఆలస్యం జరిగితే పంట సబ్సిడీలు, ఇన్పుట్ సాయం, బీమా వంటి ప్రయోజనాలు దక్కవు. అందువల్ల రైతులు సమయాన్ని వృథా చేయకుండా వెంటనే ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీ ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు మళ్లీ గుర్తు చేస్తున్నారు.