నెల్లూరు జిల్లా ప్రగతికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో పెద్ద అడుగు వేశారు. వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణలతో సమన్వయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, “పోర్టులు, విమానాశ్రయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు కొత్త దిశ చూపుతున్నాయి. కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఊపునిస్తాయి. దగదర్తి విమానాశ్రయం, బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు త్వరలోనే రూపుదిద్దుకోనున్నాయి” అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, “నెల్లూరు జిల్లా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇరిగేషన్ రంగంలోనూ సోమశిల, కండలేరు ప్రాజెక్టులను బలోపేతం చేస్తాం. 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జిల్లాకు నీటి కొరత ఉండదు. రైతుల భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది” అని అన్నారు. అలాగే, పర్యావరణం మరియు ఆర్థికాభివృద్ధి రెండూ కలిసే నడవాలని ఆయన హితవు పలికారు. విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తుందని, పాడైన బియ్యం, పంట వ్యర్ధాల ద్వారా తయారవుతున్న ఈ ఇంధనం పర్యావరణానికి హితమని, రైతులకు ఆదాయ వనరుగా మారుతోందని అన్నారు.
అదే విధంగా, గో సంరక్షణ, పశు సంక్షేమానికి విశ్వసముద్ర గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులను సీఎం ప్రశంసించారు. ‘సేవ్ ది బుల్’, ‘పవర్ ఆఫ్ బుల్’ వంటి వినూత్న కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, పునరుత్పత్తి శక్తి ఉత్పత్తిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఒంగోలు జాతి గోవుల సంరక్షణలో చింతా శశిధర్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రస్తావిస్తూ, ఇది పశుసంపద అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. అంతేకాదు, నంద గోకులం లైఫ్ స్కూల్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉత్తమ విద్య అందించడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని అభినందించారు.
భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడుతూ, “విశాఖలో రూ.88 వేల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్లో ఆమోదం తెలిపాం. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా నిలుస్తుంది. కృత్రిమ మేధస్సు, డేటా టెక్నాలజీ, పరిశ్రమల రంగాల్లో యువతను సిద్ధం చేస్తాం. 2047 నాటికి భారత్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర రాష్ట్రంగా అవతరిస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు.