ఆంధ్రప్రదేశ్లో సున్నపురాయి గనుల లీజుల మంజూరులో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా భారతి సిమెంట్స్ సహా ఏసీసీ, రామ్కో సిమెంట్స్ కంపెనీలకు ఎన్నికల ముందు మంజూరైన లీజుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలింది. కేంద్ర గనుల శాఖ, అడ్వకేట్ జనరల్ నివేదికల ఆధారంగా ఈ లీజులను రద్దు చేయాలనే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయం సిమెంట్ పరిశ్రమకు గట్టి షాక్గా మారనుంది.
కేంద్ర గనుల శాఖ 2015లో జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రధాన ఖనిజాలైన సున్నపురాయి (Limestone) గనులను వేలం ద్వారా మాత్రమే కేటాయించాలి. 2015 జనవరి 12కు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) జారీ చేసి, 2017 జనవరి 11 నాటికి అవసరమైన అనుమతులు పొందని సంస్థల LOIలను రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ నిబంధనలను విస్మరించి, అప్పటి ప్రభుత్వం 2024 ఎన్నికలకు ముందు భారతి సిమెంట్స్కు రెండు లీజులను మంజూరు చేసినట్లు సమాచారం. కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో ఉన్న ఈ లీజు భూముల విస్తీర్ణం వరుసగా 509.18 ఎకరాలు, 235.56 ఎకరాలుగా ఉంది.
ఈ భూములు మొదట రఘురాం సిమెంట్స్కు చెందినవి. 2009లో భారతి సిమెంట్స్ ఆ సంస్థను కొనుగోలు చేసి LOI పొందింది. అయితే, నిర్ణీత గడువులో అనుమతులు పొందకపోవడంతో ప్రభుత్వం LOIని రద్దు చేసింది. అనంతరం సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు తాత్కాలికంగా స్టేటస్కో ఇచ్చింది. అయినప్పటికీ, 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం మరోసారి లీజులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో, ఏసీసీ, రామ్కో సిమెంట్స్లకు కూడా ఇలాంటి లీజులు మంజూరైనట్లు బయటపడింది. కడప జిల్లా మైలవరం మండలంలో ఏసీసీకి 2,463 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో రామ్కోకు 267.30 ఎకరాలకు లీజులు ఇచ్చారు.
ఈ మూడు సంస్థలు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం)కు మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఐబీఎం తన పరిశీలనలో లీజుల్లో కేంద్ర నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించింది. వేలం లేకుండా లీజులు ఇవ్వడం చట్టవిరుద్ధమని నివేదికలో స్పష్టం చేసింది. దీని ఆధారంగా కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని పునఃపరిశీలన చేయమని కోరింది. ప్రస్తుతం న్యాయశాఖ, అడ్వకేట్ జనరల్ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ లీజులను రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. రద్దు తర్వాత కేంద్ర చట్టాల ప్రకారం పబ్లిక్ వేలం ద్వారా కొత్త లీజులు మంజూరు చేయాలనే దిశగా ఆలోచన జరుగుతోంది. ఈ చర్యలు రాష్ట్రంలో పారదర్శక గనుల విధానానికి దారితీయనున్నాయని అధికారులు చెబుతున్నారు.