ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సంపన్న వర్గాలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలి. దత్తత తీసుకునే వారిని మార్గదర్శులు, పేద కుటుంబాలను “బంగారు కుటుంబాలు”గా ప్రభుత్వం నామకరణం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ పథకం సమర్థవంతంగా అమలుచేయడానికి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఉద్యోగికి మూడు క్లస్టర్లను కేటాయించి, ఆ క్లస్టర్లలో పీ-4 కార్యక్రమం అమలుకు మార్గదర్శులు, బంగారు కుటుంబాల మధ్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ప్రత్యేక యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ కొత్త బాధ్యతలపై కొంతమంది సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేవారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ రద్దయి, ఆ బాధ్యతలు సచివాలయ ఉద్యోగులపైనే పడుతున్నాయి. ప్రతి ఉద్యోగికి మూడు క్లస్టర్లు అప్పగించడంతో పని భారం పెరిగిందని వారు భావిస్తున్నారు.
కొన్నిచోట్ల సచివాలయ ఉద్యోగులు నిరసనలు కూడా చేపట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, పీ-4 పథకం, వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం వంటి అదనపు పనులు ఇవ్వడం తగదని వారు అభిప్రాయపడుతున్నారు. వాలంటీర్లకు ఒక్కోరికీ 50 ఇళ్ల బాధ్యతలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు క్లస్టర్ల రూపంలో ఎక్కువ పని భారం తమపై మోపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
అయినా సరే, ప్రభుత్వం మాత్రం పీ-4 పథకాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయాలని సంకల్పించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి కలగడం, గ్రామీణ స్థాయిలో పేదరిక నిర్మూలన వేగవంతం కావడం లక్ష్యం. సచివాలయ ఉద్యోగులు ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే, పథకం విజయవంతం అవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది.