ఆంధ్రప్రదేశ్ అటవీశాఖకు కేంద్రం కీలకమైన ప్రతిపాదన అందించింది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కొత్తగా నగర వనాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టారు. ఈ ప్రణాళిక ద్వారా నగరాల్లో పచ్చదనాన్ని పెంచి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 54 నియోజకవర్గాల పరిధిలో 61 పార్కులకు అనుమతి లభించింది. వీటిలో 18 పార్కులు ఇప్పటికే ప్రజల కోసం ప్రారంభించబడ్డాయి. మరో 10 పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 33 చోట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
కేంద్రం ఆమోదం పొందిన వెంటనే 11 జిల్లాల 14 నియోజకవర్గాల్లో నగర వనాలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ ప్లాన్ చేసింది. ఇప్పటికే మంజూరైన వాటికి అదనంగా, 18 కొత్త నగర వనాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఈ పార్కులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త పార్కుల ద్వారా నగరాల్లో పచ్చదనాన్ని పెంచడమే కాకుండా, పర్యాటక ఆకర్షణలు, సౌకర్యాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో ఒక్క నగరవనం కూడా ఏర్పాటు కాలేదని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ వనాలు లేవు. ఈ జిల్లాల్లో వనాల కోసం అనువైన స్థలాల ఎంపిక ఇప్పటికే ప్రారంభమై, ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. అటవీశాఖ ఇటీవల కలెక్టర్లను ఆదేశిస్తూ, ప్రతిపాదనలు త్వరగా పంపించాలని సూచించింది.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వనాల జాబితా కూడా ఇప్పటికే వెల్లడించబడింది. బాపట్ల, బాపట్ల జిల్లా చీరాల, శ్రీసత్యసాయి జిల్లా కల్యాణదుర్గం, చిత్తూరు జిల్లా కుప్పం, గజరామం, అనంతపురం, కడప జిల్లా బద్వేల్, కర్నూలు జిల్లా ఆదోని పట్టణం, కర్నూలు జిల్లా డోన్, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ, శ్రీ సత్యసాయి ఎకోపార్క్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వనాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజలకు శుభ్రమైన, పచ్చదనంతో కూడిన సొగసైన ప్రదేశాలను అందించడానికి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని అధికారులు తెలిపారు. కేంద్రం సహకారంతో ప్రతి నియోజకవర్గంలో నగర వనాలను స్థాపించడానికి ప్రణాళిక రూపొందించబడింది.