ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా, రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా దేశవ్యాప్తంగా భారీగా 1.5 లక్షలకుపైగా తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించింది. పెరిగిన డిమాండ్ను తట్టుకునే క్రమంలో ఈ నియామకాలను చేపట్టినట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఈ నియామకాలు దేశంలోని 400 నగరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా జరగనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె, లక్నో, కొచ్చి వంటి ప్రధాన నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టింగ్ హబ్లు, లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్లలో ఈ కొత్త సిబ్బంది సేవలందించనున్నారు.
మహిళలు, దివ్యాంగులు కూడా ఈ అవకాశాల్లో ప్రత్యేక ప్రాధాన్యం పొందుతున్నారని అమెజాన్ వెల్లడించింది. ఇప్పటికే చాలా మంది కొత్తగా నియమితులు విధుల్లో చేరినట్లు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అమెజాన్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ –
"ప్రతి ఏడాది పండుగ సీజన్ ముగిసిన తర్వాత కూడా మా దగ్గరే చాలా మంది కొనసాగుతుండటం ఆనందకరం. ఉద్యోగుల భద్రత, శ్రేయస్సే మాకు ప్రాధాన్యం" అని పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి అనుగుణంగా అమెజాన్ పలు కార్యక్రమాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా డెలివరీ సిబ్బందికి విశ్రాంతి కోసం ‘ఆశ్రయ్’ రెస్ట్ సెంటర్లను 100కి పెంచడం, 80,000 మంది డెలివరీ అసోసియేట్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు (కళ్లు, దంతాలు, BMI మొదలైనవి) అందించడం, అలాగే ప్రతి నెల 20వ తేదీ లోపు జీతంలో 80% వరకు విత్డ్రా చేసుకునే ‘ఎర్లీ యాక్సెస్ టు పే (EATP)’ సదుపాయం కల్పించడం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.