Onion Prices: ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక చర్యలు.. బఫర్ నిల్వల నుంచి ఉల్లి విడుదల!

Onion Prices: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలపై కాలానుగుణంగా ఏర్పడే ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. మార్కెట్‌లో ఉల్లి లభ్యతను పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు బఫర్ స్టాక్‌లో నిల్వ చేసిన ఉల్లిని దశలవారీగా, లక్ష్యిత విధానంలో మార్కెట్‌కు విడుదల చేస్తోంది.

Onion Prices
Onion Prices

కిలో ఉల్లి రూ.35కే.. ధరల నియంత్రణకు కేంద్రం కొత్త చర్యలు..

ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్లాన్.. 1.21 లక్షల టన్నుల ఉల్లి సేకరణ..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలపై కాలానుగుణంగా ఏర్పడే ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. మార్కెట్‌లో ఉల్లి లభ్యతను పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు బఫర్ స్టాక్‌లో నిల్వ చేసిన ఉల్లిని దశలవారీగా, లక్ష్యిత విధానంలో మార్కెట్‌కు విడుదల చేస్తోంది.

వచ్చే నెలల్లో దేశీయ అవసరాలకు సరిపడా ఉల్లి అందుబాటులో ఉంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025-26 సంవత్సరానికి దేశంలో ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొంది.

రబీ ఉల్లి కొనుగోలుకు 2 లక్షల టన్నుల లక్ష్యం
ఉల్లి ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 2026-27లో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (PSF) బఫర్ కోసం 2 లక్షల మెట్రిక్ టన్నుల రబీ ఉల్లిని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ కొనుగోలు ప్రక్రియ మే 15న ప్రారంభమైంది. ఇప్పటివరకు సుమారు 1.21 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని బఫర్ నిల్వ కోసం సేకరించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కిలో ఉల్లి రూ.35కే విక్రయం
బఫర్ నిల్వల నుంచి విడుదల చేసే ఉల్లిని వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరకు విక్రయించనున్నారు. కిలో ఉల్లి రూ.35 చొప్పున విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED)కు చెందిన మొబైల్ వ్యాన్లు, రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా ఉల్లిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే సఫల్, కేంద్రియ భండార్ ఔట్‌లెట్లలోనూ విక్రయాలు చేపట్టనున్నారు. దీంతో మార్కెట్‌లో సరఫరా పెరిగి, వినియోగదారులపై ధరల భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

నాసిక్ నుంచి ఢిల్లీకి ‘కందా ఎక్స్‌ప్రెస్’
ఉల్లి రవాణాను వేగవంతం చేసేందుకు రైల్వే మార్గాన్ని కూడా కేంద్రం వినియోగిస్తోంది. మొదటి ‘కాందా ఎక్స్‌ప్రెస్’ నాసిక్ నుంచి బయలుదేరింది. ఇందులో సుమారు 800 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉంది.

ఈ రైలు గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రధాన వినియోగ కేంద్రాలకు రోడ్డు మార్గంలోనూ ఉల్లి సరఫరా చేస్తున్నారు.

దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు
2025-26లో ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా ఉండటంతో దేశీయ డిమాండ్‌ను తీర్చేందుకు తగినంత ఉల్లి లభ్యత ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

అయితే కొన్ని ప్రాంతాల్లో కాలానుగుణంగా ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే బఫర్ నిల్వలను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఉల్లి సరఫరా, ధరల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు తీసుకోనుంది. కేంద్రం చేపట్టిన ఈ చర్యలతో రైతుల నుంచి సేకరించిన ఉల్లిని సమర్థంగా మార్కెట్‌కు తరలించడంతో పాటు, వినియోగదారులకు అందుబాటు ధరలో ఉల్లి లభించే అవకాశం ఉంది.

Be the first to react

Latest