ఒమాన్కు పని.. ఆరోగ్య సమస్యలు కారణంగా భారత్కు తిరిగి రావాలని నిర్ణయం..
ఏజెంట్ ఒత్తిడి.. గదిలో బంధించి, ఆహారం ఇవ్వకుండా..
ఉద్యోగం కోసం ఒమాన్కు వెళ్లిన ఒక మహిళకు ఎదురైన భయానక అనుభవం చివరికి సుఖాంతం అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో ఆమెను సురక్షితంగా రక్షించి స్వదేశానికి పంపించే చర్యలు తీసుకున్నారు.
శహ్నాజ్ అనే మహిళ మస్కట్, ఒమాన్కు పని కోసం వెళ్లి అక్కడ ఒక అరబ్ ఇంట్లో మెయిడ్గా పనిచేయడం ప్రారంభించింది. కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె భారత్కు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఆమె పని చేసిన ఇంటి యజమానులు దీనికి అంగీకరించి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు.
అయితే, ఒమాన్లో ఆమెను రిసీవ్ చేసుకున్న బంగ్లాదేశ్కు చెందిన ఏజెంట్ మాత్రం ఆమెను అక్కడే ఉండి పని చేయాలని ఒత్తిడి చేశాడు. ఆరోగ్య కారణాలతో పని చేయలేనని చెప్పిన శహ్నాజ్పై ఆ ఏజెంట్ దౌర్జన్యానికి దిగాడు. ఆమెను ఒక గదిలో బంధించి, ఆహారం ఇవ్వకుండా కొట్టి వేధించాడు.
ఈ పరిస్థితుల్లో శహ్నాజ్ ఒక వీడియో తీసి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి తన పరిస్థితిని వివరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది.
ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టికి చేరింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నాగబాబు వెంటనే ఒమాన్లోని తమ బృందాన్ని అప్రమత్తం చేసి సహాయం అందించాలని కోరారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈ ఘటనపై స్పందించి వెంటనే ఆమెను రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీఎన్ఆర్టీ మరియు ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ చర్యలు ప్రారంభించాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఎన్నారై టీడీపీ సెల్ ఒమాన్ టీంతో సంప్రదించి శహ్నాజ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. అక్కడి NRI టీడీపీ కి చెందిన నాగరాజు, రాజేష్, శ్రీనివాస్ మరియు జనసేన కు చెందిన రాందాస్, డా. వినోద్ తో పాటు మరి కొంతమంది కూటమి కార్యకర్తలు కలిసి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తన తిరుగు ప్రయాణానికి సంబంధించిన టిక్కెట్టు ఆ ఏజెంట్ చేతనే ఇప్పించారు. అదేవిధంగా కార్యకర్తల నిమిత్తం జనసేన కార్యకర్తలు 30 వేల రూపాయలు ఒమన్ జనసేన నేత రామదాసు చేతుల మీదుగా ఆమెకు అందించారు.
ప్రస్తుతం శహ్నాజ్ మస్కట్ నుంచి ముంబైకి ఈ రోజు (7 మే) మధ్యాహ్నము 1 గంటకు బయలుదేరింది. ముంబై లో భారతీయ ఏజెంట్ ఆమెను రిసీవ్ చేసుకొని ఆమె స్వగ్రామానికి పంపించనున్నారు. ఈ రోజు సాయంత్రము 7 గంటలకు హైదరాబాదు సురక్షితం గా చేరుకున్నది.
రక్షణ అనంతరం శహ్నాజ్ మరో వీడియో విడుదల చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టీ, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ మరియు ఆమెకు సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. సమయానికి స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం, కూటమి కార్యకర్తల సహకారంతో మరో మహిళ ప్రమాదం నుంచి బయటపడింది.