ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగించేలా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా కూడా ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.
నిన్న ఉదయం వరకు తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,35,380గా ఉండగా, తాజాగా రూ.1,520 తగ్గి రూ.1,33,860కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలో రూ.1,34,010గా, ముంబైలో రూ.1,33,860గా నమోదైంది.
ఇక వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ఉదయం వరకు కిలో వెండి ధర రూ.2,03,100 వద్ద ట్రేడవ్వగా, ప్రస్తుతం సుమారు రూ.3,900 తగ్గి రూ.1,99,100కు చేరింది. అయితే హైదరాబాద్ మార్కెట్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,11,000 వద్ద కొనసాగుతోంది.
బంగారం, వెండి ధరలపై అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం ప్రధాన ప్రభావం చూపుతున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనితో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేయడం కూడా ధరల ఊగిసలాటకు కారణమవుతోంది.
అలాగే గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు వంటి అంశాలు కూడా విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధరలు మారే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.