Hyderabad: హైదరాబాద్లో నకిలీ పనీర్ విక్రయాల గుట్టురట్టు.. 825 కిలోల కల్తీ ఉత్పత్తులు స్వాధీనం!
Hyderabad: నగరంలో భారీగా నకిలీ, కల్తీ పనీర్ విక్రయాలు జరుగుతున్నట్లు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సుమారు 825 కిలోల అనుమానాస్పద కల్తీ పనీర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
45 దుకాణాలు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు.. అక్రమాలు వెలుగులోకి..
నకిలీ పనీర్తో ప్రజల ఆరోగ్యానికి ముప్పు.. కఠిన చర్యలకు అధికారులు సిద్ధం..
హైదరాబాద్: నగరంలో భారీగా నకిలీ, కల్తీ పనీర్ విక్రయాలు జరుగుతున్నట్లు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా సుమారు 825 కిలోల అనుమానాస్పద కల్తీ పనీర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలోని దాదాపు 45 రిటైల్ దుకాణాలు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొంతమంది వ్యాపారులు చీజ్ అనలాగ్ ఉత్పత్తులను పనీర్ పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
చీజ్ అనలాగ్ అనేది పాలకు బదులుగా కూరగాయల కొవ్వులు, ఇతర పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తి. అయితే దీనిని కొందరు వ్యాపారులు “పనీర్”, “మలై పనీర్”, “మిల్క్ పనీర్”, “ఫ్రెష్ పనీర్” వంటి పేర్లతో అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు.
చాలా ఉత్పత్తులపై తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, గడువు తేదీ వంటి ప్రాథమిక వివరాలు కూడా లేకపోవడం బయటపడింది. కొందరు వ్యాపారులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి చీజ్ అనలాగ్ను కొనుగోలు చేసి, అధిక లాభాల కోసం పనీర్ పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కొన్ని చోట్ల భారీగా తెచ్చుకున్న ఉత్పత్తులను సరైన లైసెన్సులు లేకుండా “ప్రీమియం పనీర్” వంటి పేర్లతో తిరిగి ప్యాకింగ్ చేస్తున్నట్లు కూడా గుర్తించారు.
తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. స్టార్చ్ కలపడం, అధిక నీటి వినియోగం, పాలేతర కొవ్వులు, నాణ్యత లేని లేదా కృత్రిమ పాలు ఉపయోగించడం వంటి అక్రమాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని వ్యాపార సంస్థలు సరైన FSSAI లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్లు, ఉత్పత్తులను అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ చేస్తున్నట్లు తేలింది.
ఇలాంటి నకిలీ ఉత్పత్తుల విక్రయాలు వినియోగదారులను మోసం చేయడమే కాకుండా ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని అధికారులు హెచ్చరించారు. ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న పనీర్ నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించారు. నగరవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని, మరిన్ని దాడులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రజలు లైసెన్స్ ఉన్న విక్రేతల వద్ద మాత్రమే పనీర్ కొనుగోలు చేయాలని, ప్యాకెట్పై లేబుల్స్, తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Be the first to react