Amaravathi: అమరావతిలో సినీ పరిశ్రమకు కొత్త ఊపు.. బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభం!
Amaravathi: ప్రజా రాజధాని అమరావతి వేదికగా తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా ప్రారంభ వేడుక వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహించారు.
ప్రజా రాజధాని వేదికగా బాలయ్య సినిమా శ్రీకారం.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేష్..
అమరావతిలో తొలిసారి భారీ సినిమా ప్రారంభోత్సవం..
అమరావతి: ప్రజా రాజధాని అమరావతి వేదికగా తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా ప్రారంభ వేడుక వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన క్లాప్ కొట్టి సినిమా షూటింగ్కు శ్రీకారం చుట్టారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభోత్సవానికి తాను ఇంతవరకు హాజరు కాలేదని, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. బాలకృష్ణ నాయకత్వంలో అమరావతిని సినీ కార్యక్రమాలకు, చిత్ర నిర్మాణాలకు అనుకూల వేదికగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
సినిమా రంగంతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
అమరావతిలో సినిమా ప్రారంభోత్సవం జరగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న లోకేష్, ఇది పవిత్రమైన భూమి అని, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
అలాగే ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు హాజరై వేడుకను విజయవంతం చేశారు. అమరావతిలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవం రాష్ట్రంలో సినీ రంగానికి కొత్త అవకాశాలకు నాంది పలికిందని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.