మహారాష్ట్రలోని పూణెలో 'దృశ్యం' సినిమాను తలపించే దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన 42 ఏళ్ల సమెర్ పంజాబ్రావు జాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. అయితే, 'దృశ్యం' సినిమా చూసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుడు అంగీకరించడం గమనార్హం.
సమెర్ ఆటోమొబైల్ గ్యారేజ్ నడుపుతుండగా, అతని భార్య అంజలి (38) ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. సమెర్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటం వల్లే భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అక్టోబర్ 26న సమెర్ తన ప్లాన్ను అమలు చేశాడు. భార్యను కారులో డ్రైవ్కు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో షిండేవాడిలోని గోగల్వాడి ఫాటా వద్ద తాను అద్దెకు తీసుకున్న గోడౌన్కు తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేస్తున్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు, అంజలి మృతదేహాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న ఇనుప పెట్టెలో పెట్టి వంటచెరకుతో నిప్పంటించాడు. పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదను సమీపంలోని నదిలో పడేశాడు. ఈ హత్య కోసం నిందితుడు నెలకు రూ. 18,000 అద్దె చెల్లించి గోడౌన్ తీసుకుని, అక్కడ పెద్ద ఇనుప పెట్టెను తయారు చేయించి, వంటచెరకును కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హత్య జరిగిన రెండు రోజుల తర్వాత, 'దృశ్యం' సినిమాలో మాదిరిగానే సమెర్ వార్జే-మల్వాడి పోలీస్ స్టేషన్కు వెళ్లి భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ ఎలా సాగుతోందని తెలుసుకునేందుకు ఆందోళన నటిస్తూ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు.
అయితే అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ మరియు సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా, నిందితుడు చెబుతున్న విషయాలకు, వాస్తవాలకు పొంతన కుదరలేదు.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ప్రియురాలి కోసం భార్యను హత్య చేసి, సినిమా తరహాలో కప్పిపుచ్చాలని చూసిన భర్త ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారు.