దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణను మేళవిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘దివ్య వృక్షాల ప్రాజెక్టు’ పేరిట సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు వెల్లడించారు. ప్రాచీన ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన పవిత్ర వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచి, సంరక్షించి వినియోగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రకృతి సంరక్షణకు ఇది ఒక దృఢమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.
ధ్వజస్తంభం కేవలం ఆలయ నిర్మాణంలో భాగం మాత్రమే కాదు; అది భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభం ఒకే వృక్షానికి చెందిన, నిటారుగా పెరిగిన పవిత్ర కాండంతో తయారు చేయాలి. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, శాస్త్రోక్త నియమాలకు అనుగుణంగా ఎంపిక చేసి, ఏళ్ల తరబడి సంరక్షించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాత్రమే వినియోగిస్తారు. ఈ సంప్రదాయాలను కచ్చితంగా పాటించాలన్న దృష్టితోనే టీటీడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.
ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో ప్రధానంగా టేకు, ఏగిశా (ఇండియన్ కినో), టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలం నిలిచే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభాల అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో వీటిని స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరించడం బ్రహ్మోత్సవాలకు శుభారంభంగా భావిస్తారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను టీటీడీ నిర్వహిస్తోంది. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించాలన్న దూరదృష్టితో ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్తవాటిని ఏర్పాటు చేయడం, రాబోయే తరాల అవసరాలకు ముందుగానే పవిత్ర కలపను సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉండటంతో, ఇది బాధ్యతాయుత పాలనకు, సంప్రదాయాల పరిరక్షణకు నిదర్శనంగా నిలుస్తుందని టీటీడీ పేర్కొంది.