శ్రీవారి సన్నిధిలో శుభకార్యాలకు గ్రీన్ సిగ్నల్..
టీటీడీ కళ్యాణ వేదికలో శాస్త్రోక్త పూజలు…
తిరుమలలో శుభకార్యాలకు ప్రత్యేక వేదిక…
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే తిరుమలలోని కళ్యాణ మండపంలో ముందస్తు నమోదు ద్వారా ఉచితంగా వివాహం నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్న టీటీడీ, వధూవరులకు ఉచిత దర్శనం సౌకర్యం కూడా అందిస్తోంది.
ఇప్పుడు తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఇతర శుభకార్యాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కూడా కల్పించారు. భక్తులు కొంత రుసుము చెల్లించి శాస్త్రోక్తంగా పూజలు చేయించుకోవచ్చు. పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
వాహన పూజతో పాటు సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఉపనయనం వంటి అనేక ధార్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించవచ్చు. వివాహం మాత్రం ఉచితంగానే కొనసాగుతుంది. తిరుమలలో శుభకార్యాలు జరపాలనుకునే భక్తులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.
ఉపనయనం, సత్యనారాయణ వ్రతం రూ.300, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ, కేశఖండన, దస్త్ర పూజలకు రూ.200 ఫీజు నిర్ణయించారు. చెవిపొగులు కుట్టడం రూ.50, మేళం సింగిల్ సెట్టు రూ.100, రెండు సెట్ల మేళం రూ.300గా ఉంటుంది. భక్తులు పురోహిత సంఘాన్ని సంప్రదించి ఈ సేవలను పొందవచ్చు.