తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ కోటాను రేపు విడుదల చేయనుంది.
జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటాను అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
భక్తులు తమ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ సర్వదర్శనం టోకెన్లను ఇప్పటికే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో బుధవారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తిక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ గోపురాలు, ధ్వజస్తంభంపై దీపాలు వెలిగించి, అనంతరం జ్వాలా తోరణం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.