తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ మరో కీలకమైన నిర్ణయానికి దిగింది. పలు సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తున్న తమ జాతీయ విమానయాన సంస్థ ‘పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్’ (పీఐఏ)ను పూర్తిగా లేదా భాగం మేరకు అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి అత్యవసర ఆర్థిక సహాయం పొందేందుకు పీఐఏ ప్రైవేటీకరణ ఒక ప్రధాన షరతు. ఈ నేపథ్యంలో వచ్చే 23వ తేదీన పీఐఏలో 51 శాతం నుంచి 100 శాతం వాటాల విక్రయానికి బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పారదర్శకత కోసం ఈ బిడ్డింగ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది.
తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ప్రైవేటీకరణ పాకిస్థాన్ చరిత్రలో గత రెండు దశాబ్దాల్లో అతిపెద్ద డీల్స్లో ఒకటిగా భావిస్తున్నారు. బిడ్డింగ్ ప్రక్రియకు నాలుగు ప్రముఖ సంస్థలు అర్హత సాధించాయి. వాటిలో లక్కీ సిమెంట్ కన్సార్షియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్షియం, ఎయిర్ బ్లూ లిమిటెడ్తో పాటు పాక్ ఆర్మీ ఆధీనంలోని ‘ఫౌజీ ఫౌండేషన్’ కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉన్నాయి. పీఐఏను సైన్యం నియంత్రణలో ఉండే సంస్థ కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ప్రస్తుతం ఎక్కువ చర్చలకు దారితీస్తోంది. పాకిస్థాన్లో ఆర్మీ ప్రభావం మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
పీఐఏ దుస్థితికి కారణాల గురించి చూస్తే, సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ జోక్యం, అనర్హుల నియామకాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. 2020లో సంస్థపై పెద్ద మచ్చ పడింది. సుమారు 30 శాతం పైలట్లు నకిలీ లైసెన్సులతో పనిచేస్తున్నారని బయటపడటంతో అంతర్జాతీయస్థాయిలో పీఐఏ ప్రతిష్ఠ ఒక్కసారిగా పడిపోయింది. దాని ప్రభావంతో యూరప్, యుకే, అమెరికా వంటి దేశాలు పీఐఏ విమానాలకు నిషేధం విధించాయి. ఈ నిషేధాలు సంస్థ ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు ఈ నిర్ణయం మరింత తీవ్రమైన దెబ్బ అయింది.
ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్న పీఐఏను నిలబెట్టేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. రోజురోజుకీ అప్పులు పెరుగుతుండటంతో అప్పులపై వడ్డీలు కట్టేందుకే మళ్లీ కొత్త అప్పులు తీసుకునే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా కుప్పకూలుతున్న దేశాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఐఎంఎఫ్ షరతులకు లోబడినట్లు స్పష్టమవుతోంది. IMF నుంచి 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీ పొందడానికి పీఐఏ ప్రైవేటీకరణ తప్పనిసరి కావడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గౌరవం కల్గిన సంస్థను అమ్మకానికి పెట్టడం పాక్ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ ఒత్తిళ్లు మరియు ఆర్థిక వాస్తవాలు ఈ నిర్ణయం తప్పని స్థితిని తీసుకువచ్చాయి.