ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం..
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం..
తిరుమల: కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో తిరుమలలోని అన్ని వైకుంఠం క్యూ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్ కలిగిన భక్తులకు కూడా 4 నుంచి 5 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 6 నుంచి 8 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపట్టి, తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు అందుబాటులో ఉంచింది.
నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 67,722 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 36,705 మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. మరోవైపు స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లకు చేరినట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమలకు వచ్చే వారు ముందస్తుగా దర్శన సమయాలను తెలుసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.