తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన సంస్థ అయిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2025–27 కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలుకాగా, మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. ఆరు నెలల ఆలస్యంగా జరుగుతున్న ఈ ఎన్నికలు పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాయంత్రానికల్లా ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 3,355 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో నిర్మాతల విభాగం నుంచి 1,703 మంది, డిస్ట్రిబ్యూటర్ల విభాగం నుంచి 631 మంది, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి 916 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులు ఉన్నారు. నాలుగు సెక్టార్లకు చెందిన ఛైర్మన్లతో పాటు మొత్తం 44 మంది కార్యవర్గ సభ్యులను సభ్యులు ఎన్నుకోనున్నారు. అనంతరం, ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ద్వారా ఛాంబర్ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
ఈసారి నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవి ఎగ్జిబిటర్ సెక్టార్కు రిజర్వ్ కావడంతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది. ఒకవైపు ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, దిల్ రాజు నేతృత్వంలోని ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’, మరోవైపు సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. సమాచారం ప్రకారం, ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున డి. సురేష్ బాబు మద్దతుతో ఓ అభ్యర్థి బరిలో ఉండగా, మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇరు వర్గాలు పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి. ముఖ్యంగా ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ పేరిట కొందరు పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలను నిర్లక్ష్యం చేస్తున్నారని, పరిశ్రమలో నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారని మన ప్యానెల్ ఆరోపించింది. మరోవైపు, పరిశ్రమ అభివృద్ధి, ఓటీటీ విడుదల నిబంధనలు, కార్మికుల వేతనాల పెంపు, థియేటర్ వ్యవస్థ పరిరక్షణ వంటి అంశాలపై స్పష్టమైన విధానాలతో ముందుకు వెళ్తామని ప్రోగ్రెసివ్ ప్యానెల్ హామీ ఇచ్చింది. మధ్యాహ్నం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించనుండటంతో… తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పీఠం ఎవరి వశం అవుతుందన్న దానిపై పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.