కేంద్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.9,470 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న ప్రకటించారు. ఈ భారీ నిధులతో రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎనిమిది వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తాలూకా స్థాయిలో ఉన్న హిందూపురం పట్టణానికి వందేభారత్ రైలుకు స్టాపింగ్ కల్పించడం జరిగిందని, ఇది హిందూపురం ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన ప్రత్యేక బహుమతి అని మంత్రి సోమన్న పేర్కొన్నారు.
శనివారం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, సోమందేపల్లి ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద రూ.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక రైల్వే సదుపాయాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అభివృద్ధి చేసిన స్టేషన్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
అనంతరం హిందూపురం చేరుకున్న కేంద్ర మంత్రి సోమన్న, ఎంపీ బీకే పార్థసారథితో కలిసి యశ్వంత్పురం–హైదరాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్కు హిందూపురంలో అధికారికంగా స్టాపింగ్ ప్రారంభించారు. ఈ స్టాపింగ్ ద్వారా హిందూపురం ప్రాంత ప్రజలకు బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించనుందని తెలిపారు. వాణిజ్య, విద్య, ఉద్యోగ అవకాశాలకు ఇది ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి సోమన్న మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 1,560 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 717 ఆర్ఓవీలు, ఆర్యూవీల నిర్మాణం పూర్తయిందన్నారు. అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ఈ జాబితాలో తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హిందూపురం, ప్రశాంతి నిలయం వంటి కీలక స్టేషన్లు కూడా ఉన్నాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని, అమరావతి రాజధాని అభివృద్ధికి కూడా రైల్వేశాఖ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.