Cricket News Telugu: రికార్డులు వద్దు.. ట్రోఫీలే ముద్దు - వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

Cricket News Telugu: టీ20 వరల్డ్ కప్ 2026 విజయం తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, మైలురాళ్లను కాకుండా ట్రోఫీలను సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Cricket News Telugu: రికార్డులు వద్దు.. ట్రోఫీలే ముద్దు - వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ సంచలన వ్యాఖ్యలు!

Cricket News Telugu: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించి, టీ20 ప్రపంచకప్ 2026ను కైవసం చేసుకున్న తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌లో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే వ్యక్తిగత స్కోర్ల కోసం ఆడితే జట్టుకు నష్టం జరుగుతుందని, కేవలం ట్రోఫీలు గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. గంభీర్ పర్యవేక్షణలో భారత జట్టులో వచ్చిన ఈ మార్పే నేడు మనల్ని ప్రపంచ విజేతగా నిలిపిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ మాట్లాడుతూ… భారత క్రికెట్‌లో చాలా కాలంగా వ్యక్తిగత మైలురాళ్ల గురించే ఎక్కువ చర్చ జరుగుతోందని, కానీ తన హయాంలో ఆ సంస్కృతికి చోటు లేదని తేల్చి చెప్పారు. "నేను కోచ్‌గా ఉన్నంత కాలం ఎవరూ రికార్డుల కోసం ఆడకూడదు. 50 పరుగులు చేశారా లేదా 100 పరుగులు చేశారా అనేది ముఖ్యం కాదు, మనం కప్పు గెలిచామా లేదా అనేదే ముఖ్యం" అని ఆయన కుండబద్దలు కొట్టారు. మైలురాళ్లను సెలబ్రేట్ చేసుకోవడం మానేసి, ట్రోఫీలను సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలని ఆయన అభిమానులకు, ఆటగాళ్లకు పిలుపునిచ్చారు.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వాన్ని గంభీర్ ఆకాశానికెత్తారు. సూర్య ఒక సాధారణ కెప్టెన్ లాగా కాకుండా, ఒక గొప్ప నాయకుడిలా జట్టును ముందుండి నడిపిస్తున్నారని కొనియాడారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సూర్యకుమార్ అందరితో కలిసిపోతూ, తనకంటూ ప్రత్యేకమైన రికార్డులు ఉండాలని ఎప్పుడూ ఆశించడని గంభీర్ చెప్పారు. కెప్టెన్  కోచ్ ఇద్దరూ ఒకే ఆలోచనా విధానంతో ఉండటం వల్లే జట్టులో ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందని, ఇది విజయానికి ఎంతో దోహదపడిందని ఆయన వివరించారు.

ఈ టోర్నమెంట్‌లో సంజూ శామ్సన్ వంటి ఆటగాళ్ల ప్రదర్శనను గంభీర్ ఉదాహరణగా చూపారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో సంజూ 90కి పైగా పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినప్పుడు, తను సెంచరీ కోసం ప్రయత్నించకుండా జట్టు స్కోరును పెంచడంపైనే దృష్టి పెట్టాడని గుర్తు చేశారు. ఒకవేళ సంజూ తన వ్యక్తిగత సెంచరీ గురించి ఆలోచించి ఉంటే, టీమ్ స్కోరు 250 దాటేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ స్వార్థం లేకుండా జట్టు కోసం ఆడినప్పుడే ఇలాంటి చారిత్రాత్మక విజయాలు సాధ్యమవుతాయని గంభీర్ నొక్కి చెప్పారు.

భవిష్యత్తులో కూడా ఇదే దూకుడును కొనసాగిస్తామని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు. టీమ్ ఇండియా అంటే కేవలం స్టార్ ఆటగాళ్ల సమాహారం మాత్రమే కాదు, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడే యోధుల సమూహమని ఆయన నిరూపించారు. ప్రపంచకప్ విజయంతో భారత అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, రాబోయే రోజుల్లో అన్ని ఫార్మాట్లలోనూ భారత్ నెంబర్ వన్‌గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గంభీర్ చెప్పిన ఈ టీమ్ ఫస్ట్ మంత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Be the first to react

Latest