ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇళ్ల లబ్ధిదారులందరికీ అభినందనలు తెలుపుతూ, మిగతా ఇళ్లు కూడా త్వరలో పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇల్లు కేవలం నాలుగు గోడలు కాదని, అది భవిష్యత్తుకు భద్రత అని ఆయన అన్నారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “నిన్న కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశాం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నాం,” అని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడం తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రుణాలు తీసుకున్న మహిళలు వందశాతం రుణాలు తిరిగి చెల్లించడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఇది మహిళా శక్తి ప్రతీక అని సీఎం అన్నారు.
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఇది అని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు 3 లక్షల ఇళ్లను అప్పగిస్తున్నామని, ఉగాది నాటికి మిగతా ఇళ్లు పూర్తి చేసి అందజేస్తామని ప్రకటించారు. పేదలకు సమానంగా ముస్లిం మహిళలకు కూడా రూ.50 వేల రుణం ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే 5.9 లక్షల ఇళ్లకు ఉగాది నాటికి గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. ఇళ్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తూ, కుటుంబాలను కలిపేలా పక్కపక్కనే ఇళ్లు కేటాయిస్తున్నామని వివరించారు.
రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడుతూ, ఇంటిపైన సౌరపలకలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సోలార్, విండ్, వాటర్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని శక్తిసమృద్ధిగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని, ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ద్వారా గ్రామాల్లోనే ఉద్యోగావకాశాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
చివరిగా, నీటి వనరుల అభివృద్ధి తన జీవితాశయమని పేర్కొన్నారు. “శ్రీనివాసపురం రిజర్వాయర్ను పూర్తిచేసే బాధ్యత నాది. చెరువులన్నీ నింపి భూగర్భ జలాలను పెంచడమే మా లక్ష్యం,” అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు అందేలా చేయడం తన కల అని చెప్పారు. తాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చూపబోమని హామీ ఇచ్చారు. మొత్తం మీద, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పేదలకు భరోసా కల్పించడమే తన ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.