పరుగెత్తే నీటిని నిలపండి.. నడిచే నీటిని జలాశయంగా మార్చండి!
ఏపీని రైతు సానుకూల రాష్ట్రంగా మారుస్తాం!
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పరుగెత్తే నీటిని వృథా చేయకుండా నిల్వ చేయడం, నడిచే నీటిని జలాశయాలుగా మార్చడం ద్వారా భూగర్భ జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి భద్రత ప్రతి ఒక్కరికీ అవసరమేనని, అయితే నీటి సంరక్షణపై తగినంత శ్రద్ధ చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఒకప్పుడు రైతు ఆత్మహత్యల కేంద్రంగా ముద్ర వేసిన పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, రైతులకు అనుకూలమైన రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గతంలో రాయలసీమ ప్రాంతంలోని ఊట కాలువల్లోనూ సమృద్ధిగా నీరు ఉండేదని గుర్తుచేసిన సీఎం, ఆ ప్రాంతాన్ని రతనాలసీమగా మార్చాలనే దూరదృష్టితో ఎన్టీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. తెలుగు గంగ ప్రాజెక్టు రాయలసీమతో పాటు చెన్నై నగర దాహార్తిని కూడా తీరుస్తోందని చెప్పారు. నీటి విలువ ప్రతి ఒక్కరికి తెలిసేలా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ప్రారంభించామని, అనంతపురం జిల్లాలో చేపట్టిన జల సంరక్షణ చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రత్యేకంగా ప్రస్తావించడమే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల ఇంకుడు గుంతలు నిర్మించి, మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటిని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని వివరించారు.
అనంతపురం జిల్లాను ఎడారి ప్రాంతంగా కాకుండా పండ్లతోటల వనంగా మార్చామని, హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 40 జీవనదుల నీటిని సద్వినియోగం చేసుకుంటే కరవు అనే మాటే ఉండదని చెప్పారు. సాగునీటి సంఘాలకే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తున్నామని, అవి ప్రతి ఎకరాకు నీరు అందేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ భారం లేకుండా చర్యలు తీసుకుంటామని, గతంలో వైసీపీ హయాంలో చేసిన పనులకు చెల్లింపులు చేసే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
నీటి పన్నులు వసూలు చేసుకుని కాలువల నిర్వహణను స్వయంగా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,700 నీటి వినియోగదారుల సంఘాలు, 58 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రబీ, ఖరీఫ్ సాగుకు సరైన సమయంలో నీరు అందేలా ముందస్తు ప్రణాళిక అవసరమని, వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, భూగర్భ జలాలు, కాలువలు, ప్రాజెక్టుల ద్వారా నీటి నిర్వహణ బాధ్యతలను నీటి వినియోగదారుల సంఘాలు సమర్థంగా నిర్వర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.