విద్యా రంగంపై రూ.10,000 కోట్ల ఖర్చు…
16,300 టీచర్ పోస్టుల భర్తీతో విద్యా వ్యవస్థకు కొత్త ఊపిరి…
ఉన్నత చదువులే లక్ష్యం…
ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో విద్యార్థుల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు దూరం భారం వల్ల పడే ఇబ్బందులను తొలగించడానికి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం కొమ్మినేనివారి పాలెం, వల్లాపల్లి, అంబడిపూడి జిల్లా పరిషత్ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. దాతలు, సేవా సంస్థల సహకారంతో ఇప్పటివరకు 6,500 మంది విద్యార్థులకు సైకిళ్లు అందించామని, రాబోయే రోజుల్లో మరో 4,000 మందికి వీటిని పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,300 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని, దీనివల్ల ప్రతి తరగతికి ఒక టీచర్ అందుబాటులోకి వచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు నాసిరకం వస్తువులు ఇచ్చారని విమర్శించిన ఆయన, ఇప్పుడు నాణ్యమైన షూలు, యూనిఫాంలతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం గురించి మంత్రి గొట్టిపాటి కీలక వివరాలు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థుల చదువుల కోసం ఈ పథకం కింద దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా కేవలం ఒక్కరికే ఆర్థిక సాయం అందేదని, కానీ ఇప్పుడు అర్హులైన విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున అందజేస్తున్నామని వివరించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక స్టడీ మెటీరియల్ను కూడా మంత్రి పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని 2,000 మంది పదో తరగతి విద్యార్థులకు ఈ మెటీరియల్ను అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే శారీరక వికలాంగులైన 135 మంది విద్యార్థులకు రూ.1.30 లక్షల విలువైన ట్రై సైకిళ్లను కూడా పంపిణీ చేసి, వారు ఇతరులపై ఆధారపడకుండా పాఠశాలలకు వచ్చేలా ప్రభుత్వం చేయూతనిచ్చిందని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పీ4 (P4) పథకం స్ఫూర్తితో సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. దాతలు మరియు సీఎస్ఆర్ (CSR) నిధుల సహకారంతో అద్దంకిలో ఇన్ని సైకిళ్లను పంపిణీ చేయగలిగామని, కొందరు విద్యార్థులకు తన సొంత ఖర్చులతో కూడా సైకిళ్లు అందజేశానని తెలిపారు. ప్రభుత్వంతో పాటు దాతలు కూడా చేతులు కలపడం వల్ల ప్రభుత్వ విద్యార్థులకు మెరుగైన వసతులు సమకూరుతున్నాయని అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,