ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వివిధ పరిశ్రమలు స్థాపనకు సిద్ధమవుతున్నాయి. ఫార్మా, సోలార్ ప్యానళ్ల తయారీ, లైట్ బ్రిక్స్ వంటి రంగాల్లో అనేక సంస్థలు అడుగుపెట్టనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం భూముల కేటాయింపుతో పాటు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది.
అనకాపల్లి జిల్లాలో లారస్ ఫార్మా జోన్ అభివృద్ధికి ప్రభుత్వం 531.77 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-2లో అందుబాటులోకి తెచ్చింది. ఎకరానికి రూ.30 లక్షల చొప్పున సంస్థ భూమి విలువ చెల్లించనుంది. సంస్థ రూ.5,600 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును నిర్మించనుండగా, 6,350 మందికి ఉపాధి కల్పించనుందని అధికారిక డీపీఆర్లో వెల్లడైంది.
ఇతర పరిశ్రమల విషయానికి వస్తే, అనకాపల్లిలో రాంబిల్లిలోనే ఆర్ఈ న్యూ అనే సంస్థ 6 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానళ్ల తయారీ యూనిట్ను నిర్మించనుంది. ఇందుకోసం సంస్థకు 135.96 ఎకరాల భూమిని కేటాయించారు. రూ.3,700 కోట్ల పెట్టుబడి వస్తుందని, 1,200 మందికి ఉపాధి కల్పించనుందని అంచనా.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సాంచంలో వీఎస్ఆర్ సర్కన్ ఇండస్ట్రీస్ సంస్థ AAC లైట్ బ్రిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం ఎకరానికి రూ.11.62 లక్షల చొప్పున 22.45 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 5 గిగావాట్ల సోలార్ సెల్స్, మరో 5 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ యూనిట్ను నిర్మించనుంది. రూ.6,933 కోట్ల పెట్టుబడి విలువైన ఈ ప్రాజెక్టుతో 2,138 మందికి ఉపాధి కల్పించనున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఇది మరింత వేగంగా ముందుకు వెళ్లనుంది.
మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లో అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 13.85 ఎకరాలు, మోడల్ ఇండస్ట్రియల్ పార్క్లో మరో 115.65 ఎకరాలను ఎకరానికి రూ.16.5 లక్షల చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె సమీపంలో ఏసీఈ ఇంటర్నేషనల్కు గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ డెయిరీ ఉత్పత్తుల న్యూట్రిషన్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 75.63 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.1,000 కోట్ల పెట్టుబడితో పాటు 2 వేల మందికి ఉపాధి లభించనుంది.
అంతేకాకుండా, బ్రాండిక్స్ ఇండియా అపరల్ సిటీకి చెందిన అధిష్ఠాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించిన 695.35 ఎకరాల లీజు గడువును మరో 25 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.