విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ (Narayana) అన్నారు. ఆదివారం నాటి 'మన్ కీ బాత్'లో విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని ప్రశంసించారని తెలిపారు.
విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని వ్యాఖ్యానించారన్నారు. ఆయన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో నగరానికి ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కిందని గుర్తుచేశారు.
“విజయవాడ కార్పొరేషన్లో ప్రతిరోజు 16 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నాం. కొండప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించింది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు" అని మంత్రి నారాయణ తెలిపారు.