ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి- సాయినగర్ శిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే (SC Railways) నిర్ణయించింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 29వరకు సర్వీసులందిస్తాయని తెలిపింది.
(Special trains) -తిరుపతి - సాయినగర్ శిర్డీ రైలు (07637) తిరుపతిలో ప్రతి ఆదివారం ఉదయాన్నే 4గంటలకు బయల్దేరి మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10.45 గంటలకు శిర్డీకి చేరుకోనుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28వరకు ప్రతి ఆదివారం ఈ రైలు సర్వీసులందిస్తుంది.
అలాగే, శిర్డీ- తిరుపతి రైలు (07638) సోమవారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు (తెల్లవారితే బుధవారం) తిరుపతి చేరుకోనుంది. ఈ రైలు సర్వీసులు ఆగస్టు 4నుంచి సెప్టెంబర్ 29వరకు కొనసాగనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహిరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గిర్, లాతూర్ రోడ్డు, పర్లి, గంగఖేర్, పర్బని, సేలు, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్, కోపర్గావ్ స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఎసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయి.