గత కొన్ని రోజులుగా విమానాల రద్దు, ఆలస్యంతో ఇండిగో విమానయాన సంస్థ సేవలు అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు.
ఈ పరిస్థితిపై ఇండిగో ఎయిర్ లైన్స్ సీఈవో పీటర్ ఎల్బర్స్ స్పందించారు. డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ నాటికి విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రకటించారు. శనివారం నాటికి రద్దయ్యే విమానాల సంఖ్య 1,000 కంటే తక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల విమానయాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇండిగో నెట్వర్క్లో 30 శాతానికి పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. దీంతో వేలాది విమానాలను రద్దు చేయాల్సి రాగా, లక్షలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడంలో ఇబ్బందులు పడ్డారు.
ఈ నేపథ్యంలో పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ, "ఈ సవాళ్లను అధిగమించడానికి మా బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. షెడ్యూళ్లను మెరుగుపరుస్తున్నాం. రోజురోజుకు పరిస్థితి మెరుగవుతోంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేం క్షమాపణలు కోరుతున్నాం" అని తెలిపారు. ప్రస్తుతం కొత్త షెడ్యూలింగ్, అదనపు వనరులతో సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా పర్యవేక్షిస్తోంది. ప్రయాణికులు తమ విమాన ప్రయాణ వివరాల కోసం ఎప్పటికప్పుడు ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా యాప్ను చూసుకోవాలని సంస్థ సూచించింది.
కాగా, ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో, ఇతర ఎయిర్ లైన్స్ సేవలు విపరీతంగా రేట్లు పెంచేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా కొన్ని దేశీయ రూట్లలో రూ.33 వేలు ఉండే టికెట్ ధర ఇప్పుడు రూ.93 వేలకు చేరింది.