భారత ప్రభుత్వం ప్రవాసీ కార్మికుల కోసం రూపొందిస్తున్న ఓవర్సీస్ మొబిలిటీ బిల్–2025లో భారత వలస కార్మికుల హక్కులు బలహీనపడకుండా రక్షణ చర్యలను చేర్చాలని తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి మరియు సభ్యుడు చెన్నమనేని శ్రీనివాస రావులు కోరారు. గురువారం వారు ఢిల్లీలో పర్యటించి తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. దేశం నుంచి విదేశాలకు పయనమయ్యే లక్షలాది మంది కార్మికులు గౌరవంగా, భద్రతగా జీవించాలని, వారిని రక్షించే నిబంధనలు కొత్త బిల్లులో తప్పనిసరిగా ఉండాలని వారు స్పష్టం చేశారు.
1983 నుంచి అమల్లో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్కు బదులుగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్న సందర్భంలో, ఈ మార్పులు వలస కార్మికుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని బృందం పార్లమెంటు సభ్యులకు వివరించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యురాలు డీకే అరుణ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, డా. కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు విశ్లేషణాత్మకంగా చర్చించారు. 2021లో రూపొందించిన ముసాయిదాలో ఉన్న కొన్ని కీలక రక్షణ నిబంధనలు కొత్త బిల్లులో లేకపోవడం ఆందోళనకరమని వారు పేర్కొన్నారు. అధికారాలు కేంద్రీకృతమైనప్పుడు దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాసరావులు హెచ్చరించారు.
కొత్త బిల్లులో ప్రవాసీ కార్మికుల హక్కులు బలహీనపడ్డాయని ప్రతినిధులు గుర్తించారు. బాధిత కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కును తొలగించడం, మహిళలు–పిల్లలకు ప్రత్యేక రక్షణ నిబంధనలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట శీర్షికలో కలపడం తీవ్రమైన లోపాలని చెప్పారు. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాలను వెల్లడించే బాధ్యతను తొలగించడం వల్ల కార్మికులు రుణ బానిసత్వానికి గురయ్యే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. విదేశాలకు పంపిన తర్వాత ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, తిరిగి వచ్చిన వారికి పునరేకీకరణకు సంబంధించిన నిబంధనలు బలహీనపడటం, 182 రోజులకు లోగా డిపోర్ట్ అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం వంటి అంశాలు కార్మికుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తాయని వారు తెలిపారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో నిర్వచనాల విషయంలో కూడా అనేక లోపాలు ఉన్నాయని ప్రతినిధులు గుర్తించారు. ‘ఎమిగ్రంట్’, ‘లేబర్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులను వెలివేయడం పెద్ద సమస్య అని అన్నారు. ‘హ్యూమన్ ట్రాఫికింగ్’కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం, కేంద్రీకృత పాలనా వ్యవస్థలో రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల స్థానిక సమస్యలు పరిష్కారం కాని అవకాశముందని వారు చెప్పారు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్'లో వలస కార్మికులను పంపే రాష్ట్రాలు, హక్కుల సంస్థలకు చోటు లేకపోవడం తీవ్రమైన లోపమని వివరణ ఇచ్చారు.
అత్యంత ముఖ్యమైన అంశాల విషయంలో కూడా కొత్త బిల్లులో స్పష్టతలేమి ఉందని బృందం తెలిపింది. ఎమిగ్రేషన్ చెక్పోస్టులు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ రక్షణ వ్యవస్థ లేకపోవడం, విదేశాలకు వెళ్లే ముందు శిక్షణ విధానాలు స్పష్టంగా లేకపోవడం, సహాయక సేవలకు సంబంధించిన ప్రమాణాలు నిర్ధారించకపోవడం వంటి విషయాలను వారు చర్చించారు. 24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదాలో ఉండటం కూడా ఆందోళన కలిగించేదని చెప్పారు. శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే ఉండడం, విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేకపోవడం, ట్రాఫికింగ్ మరియు చట్టవిరుద్ధ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం వంటి లోపాలను వెంటనే సరిచేయాలని కోరారు. బిల్లులో విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం ఇవ్వకపోవడం కూడా తీవ్ర అన్యాయమని వారు సూచించారు.