Astrology tips: భర్త మరణం తర్వాత మంగళసూత్రం విషయంలో ఏం చేయాలి? పండితులు చెబుతున్న అసలు నిజాలివే!
Astrology tips: భర్త మరణం తర్వాత మంగళసూత్రం, గాజులు, మెట్టెల విషయంలో అనుసరించాల్సిన నియమాలేంటి? చనిపోయిన వారు వాడిన బంగారానికి దోషం ఉంటుందా? పండితుల సూచనలు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి
Mangalsutra traditions: హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పెళ్లి నాటి నుంచి స్త్రీ తన ప్రాణప్రదంగా భావించే ఈ ఆభరణం, భర్త ఆరోగ్యాన్ని, కుటుంబ సౌభాగ్యాన్ని సూచిస్తుంది. అయితే, విధివశాత్తూ భర్త చనిపోయినప్పుడు ఆ మంగళసూత్రం విషయంలో మహిళలు, వారి కుటుంబ సభ్యులు అనేక రకాల గందరగోళాలకు గురవుతుంటారు. మంగళసూత్రాలను తీసేయాలా? వాటిని వేరే నగలుగా మార్చుకోవచ్చా? లేక ఎవరికైనా దానం చేయాలా? అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి. దీనిపై ధర్మశాస్త్ర పండితులు జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
చాలామంది భర్త చనిపోయిన తర్వాత ఆ మంగళసూత్రాలను భద్రపరచడం లేదా ధరించడం దోషమని భావిస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారానికి ఎటువంటి అశుభం ఉండదు. బంగారం ఏ రూపంలో ఉన్నా అది పవిత్రమైనదే. భర్త మరణానంతరం మంగళసూత్రంలోని బంగారు బిళ్లలను లేదా పతకాన్ని తీసి, వాటిని కరిగించి ఉంగరాలుగానో లేక కొత్త గొలుసుగానో మార్చుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి దోషం కలగదు. ఒకవేళ ఆ బంగారాన్ని తిరిగి ధరించడానికి మనసు ఒప్పుకోకపోతే, ఆ పవిత్రమైన నగలను దగ్గర్లోని దేవాలయాల్లో అమ్మవారికి సమర్పించడం ఉత్తమమైన మార్గమని పండితులు సూచిస్తున్నారు.
ఇక గాజులు, మెట్టెలు, పట్టీల విషయానికి వస్తే కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. సాధారణంగా భర్త చనిపోయినప్పుడు మట్టి గాజులను పగులగొట్టడం ఒక ఆచారంగా వస్తోంది. కానీ బంగారు గాజుల విషయంలో అటువంటి నిబంధన ఏమీ లేదు. వాటిని తీసివేయాల్సిన అవసరం లేదని, మహిళలు తమ ఇష్టప్రకారం వాటిని ధరించవచ్చని శాస్త్రం చెబుతోంది. అలాగే కాళ్లకు పెట్టుకునే పట్టీలు చిన్నప్పటి నుంచి ధరించేవి కాబట్టి, వాటికి వైధవ్యంతో సంబంధం ఉండదు. కేవలం మెట్టెలను మాత్రం సంప్రదాయం ప్రకారం పదవ రోజు కర్మల సమయంలో తీసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆభరణాల పంపకం. గతంలో ఆస్తుల విషయంలో పెద్దగా స్పష్టత ఉండేది కాదు కానీ, ఇప్పుడు కాలం మారింది. అత్తగారు ఇచ్చిన నగలు కోడలికి, పుట్టింటి వారు ఇచ్చిన నగలు కూతుళ్లకు చెందడం మన సంప్రదాయం. వయసు మళ్లిన తర్వాత పెద్దలే తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఎవరికి ఇవ్వాలో ముందే నిర్ణయించడం వల్ల భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. బంగారం కోసం కలహించుకోవడం కంటే, పెద్దలు నేర్పిన విలువలను కాపాడుకోవడమే నిజమైన గౌరవమని పండితులు గుర్తు చేస్తున్నారు.
చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆచారాలు అనేవి మన మనశ్శాంతి కోసం ఏర్పడినవి. కాలక్రమేణా మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా, మూఢనమ్మకాలకు తావు లేకుండా శాస్త్రీయ దృక్పథంతో వీటిని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వారు వాడిన నగలు అపవిత్రం అనే భావన పక్కన పెట్టి, వాటిని జ్ఞాపకాలుగానో లేదా అవసరానికి పనికొచ్చే ఆస్తిగానో చూడటం మేలు. ఏవైనా సందేహాలు ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన పురోహితులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
Be the first to react