ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి భారతీయుడికి తప్పనిసరి పత్రంగా మారింది. ఇందులో వ్యక్తి పేరు, చిరునామా, జననతేది, వేలిముద్రలు, కంటి మణి స్కాన్ వంటి కీలకమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. బ్యాంకింగ్, పన్ను చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, పాస్పోర్ట్, విద్యా రుణాలు, ఇన్సూరెన్స్ వంటి అనేక రంగాల్లో ఆధార్ ఒక గుర్తింపు పత్రంగా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పరిస్థితిలో ఆధార్ కార్డులో వివరాలు సరిచేయాలనుకునే వారు తప్పనిసరిగా సమీపంలోని ఇ-సేవా కేంద్రాలు లేదా ఆధార్ అప్డేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. తాజాగా UIDAI ఆధార్ సేవల రుసుములను పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త రుసుములు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి.
ఇప్పటి వరకు పేరు, చిరునామా మార్పులు చేయించుకోవడానికి రూ.50 మాత్రమే వసూలు చేసేవారు. ఇకపై ఈ రుసుము రూ.75గా నిర్ణయించబడింది. అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేట్లు – అంటే వేలిముద్రలు, కంటి మణి స్కాన్ వివరాలను మార్చుకోవడానికి లేదా సరిచేయడానికి ఇప్పటి వరకు రూ.100 వసూలు చేసేవారు. ఇకపై ఈ రుసుము రూ.125గా పెరిగింది. అంటే, ప్రతీ సర్వీస్పై కనీసం రూ.25 అదనపు భారం పడనుంది. అయితే కొత్త ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి ఫీజు ఉండదని UIDAI స్పష్టం చేసింది. ఈ నిర్ణయం లక్షలాది మంది పౌరులపై ప్రభావం చూపనుంది.
UIDAI ప్రకారం ఈ రుసుముల పెంపు వెనుక పలు కారణాలు ఉన్నాయని చెబుతోంది. ఆధార్ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, సాంకేతిక పరిజ్ఞాన అప్డేట్ అవసరం, డేటా భద్రతను మరింత బలపరచడం వంటి అంశాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రతి రోజు దేశవ్యాప్తంగా లక్షల మంది పౌరులు ఆధార్ సెంటర్లలో సేవలు పొందుతున్నందున, ఈ పెంపు తప్పనిసరి అయిందని UIDAI చెబుతోంది. రుసుములు పెరగడం పౌరులకు కొంత భారంగా మారినా, ఆధార్ అప్డేట్ చేయకపోతే పలు సేవలు అందకపోవడం వల్ల వారు తప్పనిసరిగా ఈ సేవలను పొందాల్సిందే.
ఇక ఈ కొత్త రుసుములు తాత్కాలికం కావు. UIDAI ప్రకటన ప్రకారం, అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2028 వరకు ఈ కొత్త ఫీజు నిర్మాణం కొనసాగనుంది. అంటే, వచ్చే మూడేళ్ల పాటు ఆధార్ సవరణలు చేయాలనుకునే పౌరులు పెరిగిన రుసుములను చెల్లించాల్సిందే. కాబట్టి, త్వరలోనే వివరాలను సవరించుకోవాలని భావిస్తున్నవారు ఈ మార్పులను గమనించి ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిది. లేదంటే కొత్త రుసుముల భారం తప్పదు. ఈ మార్పులు ప్రతి ఇంటిని ప్రభావితం చేయనున్నాయి కాబట్టి UIDAI ప్రకటించిన ఫీజు నిర్మాణంపై ప్రజల దృష్టి సారిస్తోంది.