ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన సరికొత్త ఉత్పత్తిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎస్1 ప్రో సిరీస్లో అత్యంత స్పోర్టీ వెర్షన్గా ‘ఎస్1 ప్రో స్పోర్ట్’ పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. అద్భుతమైన వేగం, మెరుగైన రేంజ్తో యువతను ఆకర్షించేలా రూపొందించబడింది.
కంపెనీ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.50 లక్షలుగా నిర్ణయించింది. కొత్త మోడల్లో డిజైన్లో పలు మార్పులు చేసారు. ఇందులో ఓలా కొత్తగా అభివృద్ధి చేసిన 4680 బ్యాటరీని అమర్చారు, ఇది వేగంగా చార్జ్ అవ్వడమే కాకుండా అధిక శక్తిని నిల్వ చేస్తుంది.
పనితీరు పరంగా, ఈ స్కూటర్ గంటకు గరిష్ఠ వేగం 152 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2 సెకన్లలో అందించగలదు. 5.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ పూర్తిగా చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ను అందిస్తుంది. స్వదేశీ ఫెర్రైట్ ఎలక్ట్రిక్ మోటార్ 16 కేడబ్ల్యూ గరిష్ఠ శక్తి, 71 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
డిజైన్ పరంగా, కొత్త సీటు, కార్బన్ ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, కార్బన్ ఫైబర్ గ్రాబ్ హ్యాండిల్, ఏరో విండ్షీల్డ్ వంటి స్పోర్టీ అంశాలను అమర్చారు. ముందు భాగంలో కెమెరా ఏర్పాటు చేసి, కొలిజన్ డిటెక్షన్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) కోసం ఉపయోగించనున్నారు. ఈ ఫీచర్ల కోసం కొత్త మూవ్వోఎస్ 6 సాఫ్ట్వేర్ను అందిస్తున్నారు. 14 అంగుళాల వీల్స్ కూడా స్కూటర్లో ఉన్నాయి.