దేశంలోని మంత్రుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) – నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) కలిసి ఒక కీలక నివేదిక విడుదల చేశాయి. ఈ రిపోర్ట్ ప్రకారం దేశంలోనే అత్యధిక బిలియనీర్ (రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన) మంత్రులు కర్ణాటకలో ఉన్నారని, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని తేలింది. అంతేకాకుండా బిలియనీర్ మంత్రులు ఎక్కువగా ఉన్న రాజకీయ పార్టీల జాబితాలో తెలుగుదేశం రెండో స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్ర కేబినెట్లోని 25 మంది మంత్రులలో ఆరుగురు బిలియనీర్స్ అని నివేదిక పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన 21 మంది మంత్రులలో ఐదుగురి ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉండగా, జనసేనకు చెందిన మంత్రులలో ఒకరు కూడా బిలియనీర్గా గుర్తించారు. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన మంత్రిగా, అలాగే అత్యధిక అప్పులు ఉన్న మంత్రిగా నిలిచినట్లు రిపోర్ట్లో స్పష్టం చేశారు. అంతేకాదు, టాప్ 10 బిలియనీర్ మంత్రుల జాబితాలో నలుగురు ఏపీ మంత్రులు ఉండటం విశేషమని పేర్కొన్నారు.
క్రిమినల్ కేసుల విషయంలోనూ ఏపీ మంత్రులపై తీవ్ర అంశాలు బయటపడ్డాయి. నివేదిక ప్రకారం టీడీపీ మంత్రులలో టీజీ భరత్ను మినహాయిస్తే మిగతా అందరిపై కేసులు నమోదయ్యాయని, మొత్తం 96 శాతం టీడీపీ మంత్రులు క్రిమినల్ కేసుల్లో నిందితులని స్పష్టం చేసింది. 23 మంది టీడీపీ మంత్రులు (రాష్ట్రం + కేంద్రం)లో 22 మందిపై కేసులు ఉండగా, వారిలో 13 మందిపై సీరియస్ కేసులు నమోదయ్యాయని తేలింది. అయితే బీజేపీ మంత్రిపై ఎలాంటి కేసులు లేవని, రాష్ట్ర కేబినెట్లో టీడీపీకి చెందిన ఒకరు, బీజేపీకి చెందిన ఒకరు, జనసేనకు చెందిన ఒకరు మాత్రమే కేసుల్లేని మంత్రులని నివేదిక వెల్లడించింది.