జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు మద్దతుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, చేనేత రంగాన్ని ఉద్ధరించేందుకు కేబినెట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
చేనేత మగ్గాల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే మరమగ్గాల కోసం 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందించనుందని వెల్లడించారు. ఇది ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు గణనీయమైన ఊరటను కలిగించనుంది.
"చేనేత కళ మన దేశ సంప్రదాయాలకు, స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీక" అని పవన్ కల్యాణ్ కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఈ నిర్ణయాల వెనుక ఉన్నదని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకంతో పాటు, ఆప్కో ద్వారా చేనేత సొసైటీలు సరఫరా చేసే వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది కార్మికుల భవిష్యత్తుకు ఒక బలమైన ఆదారం అవుతుందని అభిప్రాయపడ్డారు.
చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని, రాష్ట్ర యువత వారానికి కనీసం ఒక్కరోజు చేనేత వస్త్రాలు ధరించాలన్న పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఇది ఆ రంగానికి ప్రోత్సాహంగా నిలుస్తుందని అన్నారు.
"చేనేత అనేది కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు... అది మన సంస్కృతి, మన గౌరవానికి ప్రతీక" అని పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ రంగానికి అన్నివిధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.