నవరాత్రి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా కొత్తగా సిద్ధం చేసిన ఉపవాస భోజన విందు బుధవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రత్యేక విందు సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు.

ప్రయాణికులు ఉపవాసం చేసుకునే ఆచారాలను దృష్టిలో ఉంచుకుని, రుచికరంగా అలాగే ఆరోగ్యకరంగా ఉండేలా వంటకాలను తయారు చేశామని సంస్థ వివరిస్తోంది. ఈ భోజన పట్టికలో సభుదానా ఖిచ్డీ సల్లి తో వ్రతవాలే శాహీ ఆలూ , సింఘాడే పూరీ, సభుదానా వడా, మలై పనీర్ టిక్కా, తలే ఆలూ చాట్, ఖట్టా మీఠా సీతాఫల్, సమక్ జీరా అన్నం, అలాగే మధురమైన ఫలహారీ ఖీర్ లాంటి వంటకాలు ఉండనున్నాయి.
దీనితో పాటు సీజనల్ పండ్లు, ఉపవాసానికి అనుకూలమైన పెరుగు కూడా ఇవ్వబడుతుందని చెబుతున్నారు. ఈ ప్రత్యేక విందు భారతదేశం నుంచి బయలుదేరే అన్ని విమానాల్లో తొమ్మిది రోజుల పండుగకాలం అందుబాటులోకి వస్తుందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ప్రతి వంటకం రుచి పోషక విలువలతో సమతుల్యం అయ్యేలా తయారు చేసామని తెలపడం జరిగినది. నవరాత్రి పండుగ గుర్తు చేస్తూ ప్రయాణంలో ఉన్నప్పటికీ పండుగ రుచిని అనుభవించేలా ఈ విందును అందిస్తున్నాం అని చెప్పారు.
ఎయిర్ ఇండియా కథ 1932లో జె.ఆర్.డి. టాటా తొలిసారి విమానాన్ని నడిపినప్పటి నుంచి ప్రారంభమైందని అధికారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం 30 వేల మందికి పైగా ఉద్యోగులు, 300కి పైగా విమానాలు, 55 దేశీయ, 45 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తున్నట్లు సమాచారం.
2022లో మళ్లీ టాటా సమూహంలోకి చేరిన ఎయిర్ ఇండియా ఇప్పుడు విహాన్.ఏఐ అనే ఐదేళ్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెబుతున్నారు. దాని భాగంగానే 570 కొత్త విమానాల ఆర్డర్ కూడా ఇచ్చిందని అధికారులు తెలుపుతున్నారు.
2024లో ఎయిర్ ఏషియా ఇండియా ను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో, విస్తారా ను ఎయిర్ ఇండియా లో విలీనం చేసినట్లు చెబుతున్నారు. అలాగే దక్షిణాసియాలోనే అతిపెద్ద విమాన శిక్షణ అకాడమీను ప్రారంభించామని సంస్థ తెలియజేసింది. అదేవిధంగా 2025లో కొత్త ఫ్లయింగ్ స్కూల్ , 2026లో ఆధునిక నిర్వహణ కేంద్రం కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలపడం జరిగినది.
ప్రస్తుతం ఉన్న విమానాల అంతర్గత సౌకర్యాలను కూడా కొత్తగా మార్చుతున్నామని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా ఎదగడమే లక్ష్యమని భారతీయ ఆత్మీయతను ప్రతిబింబించేలా ముందుకు వెళ్తున్నామని ఎయిర్ ఇండియా సంస్థ తెలుపుతున్నారు