పాకిస్థాన్లో రైళ్లపై దాడులు మరోసారి భయాందోళన రేపుతున్నాయి. తాజాగా, క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దుండగులు పేలుడు జరిపారు. ఈ ఘటనలో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం సింధ్ ప్రావిన్స్లోని షికార్పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు ఉదయం ట్రైన్లో ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా బలమైన శబ్దంతో బాంబు పేలుడు సంభవించడంతో రైల్లో గందరగోళం నెలకొంది. వెంటనే సెక్యూరిటీ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి.
స్థానిక అధికారుల ప్రకారం, షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్కు సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఉదయం 8:15 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై ఉగ్రవాదులు ముందుగా అమర్చిన బాంబు స్ఫోటనం చెందింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ సమయంలో ఆ మార్గం గుండా ప్రయాణిస్తుండటంతో రైలు వెనుక భాగంలో తీవ్ర నష్టం సంభవించింది. ఈ దాడిలో గాయపడిన వారిలో నలుగురిని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రికి, మరో ముగ్గురిని షికార్పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి భద్రతా చర్యలు పటిష్టం చేశారు.
సుక్కూర్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి మోహసిన్ అలీ సియాల్ ప్రకారం, పేలుడు తర్వాత రైల్వే ట్రాక్ దెబ్బతిందని, వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రయాణికులను సమీప స్టేషన్లకు తరలించి రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు ఇది లక్ష్యంగా చేసిన దాడి అని, ఉగ్రవాదుల ప్రమేయం ఉన్న అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో రైల్వే భద్రతపై మరల ప్రశ్నలు తలెత్తాయి.
జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడులు ఇదే తొలిసారి కావు. గత నెల సెప్టెంబర్లో బలూచిస్థాన్లోని మస్తుంగ్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో 12 మంది గాయపడ్డారు. ఆ ఘటనలో రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అంతకుముందు మార్చిలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్రవాదులు ఇదే రైలును హైజాక్ చేసి, 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకోవడం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి జరిగిన ఈ దాడితో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాకిస్థాన్లో రైల్వే భద్రత పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.