గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాలపట్టి క్లీన్కారాను చూడాలని మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పాప పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించకపోవడంతో, దీనిపై అభిమానుల్లో ఆసక్తి, ఊహాగానాలు పెరిగిపోయాయి. క్లీన్కారా పుట్టినప్పటి నుంచి ఉపాసన సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నప్పటికీ, ప్రతి ఫోటోలోనూ పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మొదటి పుట్టినరోజు సందర్భంగా అయినా క్లీన్కారా ముఖం బయటకు వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూశారు, కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా ఒక కార్యక్రమంలో తమ నిర్ణయానికి గల అసలు కారణాన్ని వెల్లడించారు.
ఈ విషయంపై ఉపాసన మాట్లాడుతూ, “ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. ఏం జరుగుతుందో ఎవరికీ ముందుగా తెలియడం లేదు. కొన్ని సంఘటనలు నన్ను, చరణ్ను చాలా భయపెట్టాయి. అందుకే మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు. తల్లిదండ్రులుగా పిల్లల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, ఎయిర్పోర్టులో కూడా పాప ముఖానికి మాస్క్ వేయడం తమకు సులభం కాకపోయినా అవసరమని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“మేము చేస్తున్నది సరైనదా కాదా అనేది మాకు స్పష్టంగా తెలియదు. కానీ ఈ నిర్ణయం పట్ల మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పట్లో క్లీన్కారా ముఖాన్ని చూపించే ఆలోచన లేదు” అని ఉపాసన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తమ నిర్ణయంపై ఎంత స్థిరంగా ఉన్నారో స్పష్టమవుతోంది. పిల్లల గోప్యతను కాపాడడమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం మీడియా దృష్టికి దూరంగా ఉంచాలని వారు కోరుకుంటున్నారు.
రామ్ చరణ్–ఉపాసనల వివాహం 2012లో జరిగింది. 11 ఏళ్ల తర్వాత, 2023 జూన్ 20న క్లీన్కారా జన్మించింది. పాప పుట్టినప్పటి నుంచి దంపతులు ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నా, క్లీన్కారా ముఖాన్ని మాత్రం బయటకు చూపించలేదు. మెగా అభిమానులు పాపను చూడాలనే ఆశతో ఎదురు చూస్తున్నా, ఉపాసన తాజా వ్యాఖ్యలతో ఆ నిరీక్షణకు తాత్కాలికంగా తెరపడినట్లయింది. అయితే అభిమానులు మాత్రం “ఎప్పుడు అయినా ఒకరోజు క్లీన్కారాను చూడగలమన్న నమ్మకం ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.