ఆసియా కప్ 2025 ముగిసినప్పటికీ ఈ టోర్నమెంట్ చుట్టూ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను ఓడించి విజేతగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏసీసీ (Asia Cup Trophy) ఇప్పటివరకు భారత్ జట్టుకు ట్రోఫీ అందించలేదు. ఈ విషయంలో ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మరియు టీమిండియా మధ్య గ్రౌండ్లో పెద్ద హై డ్రామా జరిగింది. నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు నిరాకరించడంతో నక్వీ ట్రోఫీని తన హోటల్కి తీసుకు వెళ్లిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినవి.
ఇప్పటివరకు ఈ వివాదం కొనసాగుతూ కొత్త సమస్యలు కూడా తెరపైకి వచ్చాయి. పాకిస్తాన్ మీడియా ప్రకారం, నక్వీ ట్రోఫీ అందించాలంటే ఒక షరతు పెట్టారట. ఆ షరతు ఏమిటంటే భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఏసీసీ కార్యాలయానికి వెళ్లి ట్రోఫీని తీసుకోవాలి అని పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ (BCCI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆసియా కప్ ముగిసిన తర్వాత దుబాయ్లో ఏసీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రోఫీకి సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకి వచ్చింది. వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా తరచూ ఈ విషయాన్ని ప్రస్తావించగా నక్వీ మాట్లాడుతూ ఇది సమావేశ అజెండాలో లేదని మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ మీడియా ద్వారా తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వెళ్లాలి అన్నట్టు నక్వీ పేర్కొన్నారు.
బీసీసీఐ గతంలోనే స్పష్టంగా చెప్పింది మనం ఎందుకు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోము అని. నక్వీ కేవలం ఏసీసీ చీఫ్ కే కాదు, పాకిస్తాన్ పాలకుడిగా కూడా భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. అందుకే ఆయన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలని టీమిండియా ఇష్టపడడం లేదు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు, టీమిండియాకు దక్కాల్సిన ట్రోఫీ, పతకాలను నక్వీ హోటల్కు తీసుకెళ్ళడం అసభ్యకరమైన పని అని. వీలైనంత త్వరగా వాటిని భారత జట్టుకు అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
తాజాగా నక్వీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సెల్ (ICC) ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా, భారత్-పాక్ మధ్య జరుగుతున్న వివాదం ఆసియా కప్ ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ వైఖరి మాత్రం ఎప్పటికీ మారదని భారతదేశం వారికి ఎంత చేసినా భారతదేశంపై వారు పిచ్చి వ్యాఖ్యలు పట్టించుకోకూడదని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.