భారత ఇంధన రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) అండమాన్ సముద్ర గర్భంలో సహజ వాయువు నిక్షేపాలను విజయవంతంగా గుర్తించింది. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన అన్వేషణలో ఈ కొత్త గ్యాస్ జాడలు లభ్యమయ్యాయి. ఈ ఆవిష్కరణతో భారతదేశానికి భవిష్యత్తులో కొత్త ఇంధన వనరులు అందుబాటులోకి రావచ్చని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఈ అన్వేషణలో భాగంగా ఓఐఎల్ తవ్విన ఒక అన్వేషణాత్మక బావిలో 295 మీటర్ల లోతులో గ్యాస్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బావి నుంచి సేకరించిన నమూనాలను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ లేబొరేటరీలో పరీక్షించగా, అందులో 87 శాతం వరకు మీథేన్ వాయువు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి, వాణిజ్య రంగాలకు కీలక వనరుగా ఉపయోగపడనుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, రోజుకు ఎంత మోతాదులో గ్యాస్ను ఉత్పత్తి చేయగలమనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నిర్దేశించిన ప్రకారం 2,650 మీటర్ల లోతు వరకు తవ్వకాలు పూర్తి అయిన తరువాతే ఉత్పత్తి సామర్థ్యం పై స్పష్టమైన అంచనా ఇవ్వగలమని అధికారులు చెబుతున్నారు.
అండమాన్ దీవులకు సమీపంలోని మయన్మార్, ఇండోనేషియా తీరప్రాంతాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో చమురు, గ్యాస్ నిక్షేపాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో అండమాన్, నికోబార్ ప్రాంతంలో కూడా గణనీయమైన హైడ్రోకార్బన్ నిల్వలు ఉండే అవకాశం ఉందని చాలాకాలంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఇండియా హైడ్రోకార్బన్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీ’ ప్రకారం, ఈ ప్రాంతంలో దాదాపు 37.1 కోట్ల టన్నుల చమురుకు సమానమైన నిక్షేపాలు దాగి ఉండే అవకాశం ఉంది. తాజా ఆవిష్కరణ ఈ అంచనాలను బలపరుస్తోంది.
ఈ నేపథ్యంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు ఓఎన్జీసీ, ఓఐఎల్ కలిసి దాదాపు రూ.3,200 కోట్ల పెట్టుబడితో విస్తృత అన్వేషణ కార్యక్రమాలను చేపట్టాయి. ఇటీవల కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా అండమాన్ ప్రాంతంలో చమురు, గ్యాస్ నిక్షేపాలు భారీగా ఉండే అవకాశం ఉందని ప్రకటించారు. ఇప్పుడు ఆయిల్ ఇండియా లిమిటెడ్ కనుగొన్న గ్యాస్ నిల్వలు ఆ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి. ఈ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత మరింత బలపడుతుందని, భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధికి కొత్త దిశను చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.