ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య, దివ్యాంగుల కేటగిరీల్లో ఇప్పటివరకు పింఛన్లు పొందుతున్న వారిలో నిజంగా అర్హులు కానివారిని గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ, ఎవరైనా పొరపాటున అనర్హుల జాబితాలో చేరినా, తాము అర్హులమని నిరూపించుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
నోటీసు అందుకున్నవారు తమ సమీప ఎంపీడీవో కార్యాలయం లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద అప్పీల్ చేయవచ్చు. అక్కడ తమ అర్జీని సమర్పిస్తే, అధికారులు దానిని పింఛన్ పోర్టల్లో నమోదు చేసి తదుపరి దశలకు పంపిస్తారు. అనంతరం లబ్ధిదారులను ఆస్పత్రికి పిలిచి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైకల్యం 40% కన్నా తక్కువగా ఉంటే పింఛన్ రద్దవుతుంది. 40% పైగా ఉన్నవారికి మాత్రం తగిన పింఛన్ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఇక, ఇప్పటివరకు అధిక మొత్తం పొందుతున్న దివ్యాంగులు, కానీ తీవ్రమైన అనారోగ్యం లేని వారు, వారి పింఛన్లు రూ.15 వేల నుండి రూ.6 వేలకే పరిమితం చేయబడతాయి. వృద్ధుల కేటగిరీలోకి వచ్చే వారికి మాత్రం రూ.4 వేల పింఛన్ ఇవ్వబడుతుంది. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉన్నా, ధ్రువీకరణలో ఏవైనా తేడాలు ఉన్నా అప్పీల్ చేసుకోవడానికి ప్రత్యేక అవకాశం కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉచిత ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేయనున్నారు.
ప్రభుత్వం ఈ చర్యల ద్వారా నిజమైన అర్హులకే పింఛన్లు అందేలా చూసే లక్ష్యం పెట్టుకుంది. అనర్హులుగా తేలిన వారికి నష్టం జరగకుండా, వితంతు పింఛన్ అర్హత ఉన్నవారికి ఆ పింఛన్ మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఆగస్టు 25లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.