Nara Lokesh Karnataka Visit: కర్ణాటకలో మంత్రి నారా లోకేష్కు ఘనస్వాగతం.. సింధనూరులో హోరెత్తిన జై లోకేష్ నినాదాలు!
Nara Lokesh Karnataka Visit: ఏపీ మంత్రి నారా లోకేష్ కర్ణాటక పర్యటనలో భాగంగా రాయచూర్ జిల్లా సింధనూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రమంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు, యువత 'యువగళం' జెండాలతో లోకేష్కు బ్రహ్మరథం పట్టారు
Nara Lokesh Karnataka Visit: ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కర్ణాటక పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. రాయచూర్ జిల్లా సింధనూరుకు చేరుకున్న లోకేష్కు స్థానిక తెలుగు ప్రజలు, తెలుగు సంఘాలు కళ్లు చెదిరే రీతిలో స్వాగతం పలికాయి. లోకేష్ రాకతో సింధనూరు వీధులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. తమ అభిమాన నేతను చూడటానికి తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
సింధనూరులోని ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని, యువగళం జెండాలు ఊపుతూ 'జై లోకేష్' అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. లోకేష్ వెంట కేంద్రమంత్రులు హెచ్.డి. కుమారస్వామి, సంజయ్ సేథ్ కూడా పాల్గొనడం విశేషం. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మంత్రి లోకేష్ ఉత్సాహంగా ముందుకు సాగారు.
ముఖ్యంగా ఎంజీ సర్కిల్ వద్ద జేడీఎస్ నేత వెంకటరావు నాడగౌడ్ లోకేష్కు గజమాలతో స్వాగతం పలికారు. అటు పీడబ్ల్యూడీ క్యాంప్ వద్ద తెలుగు యువత మంత్రిని గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో లోకేష్ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కనిపించింది.
అశోక్ భవన్ సర్కిల్ వద్ద మరో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. సింధనూరు ఎమ్మెల్యే హంపన్నగౌడ్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్కు ఘనమైన సత్కారం జరిగింది. కనకదాస సర్కిల్ వద్ద బీజేపీ నేత కె. కరియప్ప, తెలుగు సంఘం నాయకుడు శోభన్ ఆధ్వర్యంలో గజమాలలు వేసి నీరాజనాలు అర్పించారు. ప్రతి కూడలిలోనూ అభిమానులు పూల వర్షం కురిపిస్తూ లోకేష్కు ఘనస్వాగతం పలికారు.
మంత్రి లోకేష్ పర్యటన పొరుగు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కర్ణాటకలో ఉన్న తెలుగు బిడ్డల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ, వారితో మమేకమవుతూ లోకేష్ సాగించిన ఈ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్రమంత్రులతో కలిసి ఆయన చేసిన ఈ ర్యాలీ, తెలుగు ప్రజల ఐక్యతను చాటిచెప్పేలా సాగింది.
Be the first to react