ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే గత ప్రభుత్వ ఇబ్బందికర నిర్ణయాలను కూడా తాము సరిదిద్దగలుగుతున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని డా.వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా అని సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కడప జిల్లాలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి అవసరమైన అన్ని అనుమతులు, ఆమోదాలు 06.08.2025 నాటికి తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీలో మొదటి రెండు బ్యాచ్ లకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులను 06.08.2025 నాటికి పరిష్కరించడం జరిగింది.
కడప జిల్లాలలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 2020-21 ఏడాదిలో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు ప్రారంభించారు. బాధిత విద్యార్థులు కమలాపురం పర్యటనలో నన్ను కలిశారు. మాజీ ముఖ్యమంత్రిని విద్యార్థులు కలిసినప్పుడు మాపై దాడి చేశారు.
మేమేదో అన్యాయం చేశామని మాట్లాడారు. రెండు బ్యాచ్ లకు ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా, ఎలాంటి ప్రాసెస్ పాటించకుండా ఏవిధంగా యూనివర్సిటీని ప్రారంభించారో అర్థంకావడం లేదు. విద్యార్థులు నన్ను కలిసిన తర్వాత కేంద్రంతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే గత ప్రభుత్వ ఇబ్బందికర నిర్ణయాలను సరిదిద్దగలుగుతున్నాం…. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కాబట్టే గత ప్రభుత్వ ఇబ్బందికర నిర్ణయాలను కూడా మేం సరిదిద్దగలుగుతున్నాం. ఈ రెండు బ్యాచ్ లకు రావాల్సిన అప్రూవల్స్ ను మేం తీసుకువచ్చాం.
ప్రొఫెసర్ల నియామకంలో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగింది. నోటిఫికేషన్ సరిగా ఇవ్వకపోవడంతో ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. న్యాయవివాదాలను పరిష్కరించి 4,300 పోస్టులను పద్దతిప్రకారం భర్తీ చేస్తాం. యూనివర్సిటీ భవన నిర్మాణాలను పూర్తిచేసేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.