ప్రస్తుతం సోషల్ మీడియాలో గూగుల్ “నానో బనానా” ఏఐ టూల్ గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఈ టూల్ సహాయంతో కేవలం క్షణాల్లోనే తమ ఫొటోలను ఆకర్షణీయమైన 3డీ ఇమేజ్లుగా మార్చుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి వేదికల్లో ఈ ఫొటోలు విస్తృతంగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ ఫీచర్ను ఉపయోగించి ‘శారీ ట్రెండ్’లో భాగమవుతూ ఆ ఇమేజ్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అయితే ఈ వినోదాత్మక ట్రెండ్ ఒక మహిళకు చేదు అనుభవాన్ని కలిగించింది. గూగుల్ జెమినీ ఫ్లాష్ 2.0 ఇమేజ్ మోడల్ సహాయంతో ఆమె శారీ ఇమేజ్ని తయారు చేయాలని ప్రయత్నించారు. తన ఫొటోను అప్లోడ్ చేసి ఫలితాన్ని ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ ఫలితాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపోయింది. తన శరీరంపై ఉన్న పుట్టుమచ్చను ఆ ఏఐ ఇమేజ్లో స్పష్టంగా చూపించడాన్ని చూసి ఆమె షాక్కు గురైంది.
ఆమె మాటల్లో, “ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ట్రెండ్ చూసి నేనూ శారీ ఇమేజ్ ప్రయత్నించాను. కానీ ఫోటోను జాగ్రత్తగా పరిశీలించాక భయపడ్డాను. నేను అప్లోడ్ చేసిన ఫోటోలో ఆ పుట్టుమచ్చ లేదు. మరి జెమినీకి అది ఎలా తెలిసింది? ఇది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఏఐ టూల్స్లో ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి” అని చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై నెటిజన్లు కూడా చురుకుగా స్పందించారు. ఒక యూజర్, “జెమినీ గూగుల్కు చెందినదని మరిచిపోవద్దు. మీరు అప్లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలతోపాటు ఇప్పటికే ఉన్న డిజిటల్ డేటాను ఉపయోగించి ఏఐ పిక్స్ను రూపొందిస్తుంది” అని కామెంట్ చేశారు. మరొకరు కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. తన ఫొటోలో టాటూ లేకపోయినా, జెమినీ రూపొందించిన పిక్లో టాటూ కనిపించిందని వెల్లడించారు.
ఇక మరికొందరు యూజర్లు, ఏఐ మీ డిజిటల్ ఫుట్ప్రింట్ను, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న డేటాను కలిపి ఈ తరహా ఇమేజ్లను తయారు చేస్తుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి నానో బనానా శారీ ట్రెండ్ ఒకవైపు వినోదాన్ని అందిస్తూనే మరోవైపు భద్రతా సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ వివాదంపై గూగుల్ ఎలా స్పందిస్తుందో అన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.