ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మద్యం షాపుల వ్యవహారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని లిక్కర్ షాపుల్లో 100% డిజిటల్ చెల్లింపులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నగదు లావాదేవీల వల్లే బెల్ట్ షాపులు పెరుగుతున్నాయని గుర్తుచేస్తూ, డిజిటల్ పేమెంట్స్ను కచ్చితంగా పాటించాలని సూచించారు. అంతేకాకుండా, డిజిటల్ చెల్లింపులు విజయవంతంగా అమలు చేసే షాపులకు తదుపరి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని కూడా సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బార్ల ఏర్పాటుకు ఆలస్యం ఎందుకు జరుగుతోందో సీఎం అధికారులు అడిగారు. ఈ సందర్భంగా అధికారులు, షాపులకు సరఫరా చేసే మద్యం ధరతో పోలిస్తే బార్లకు సరఫరా అయ్యే మద్యం ధర 16% ఎక్కువగా ఉండటం ప్రధాన సమస్య అని వివరించారు. అలాగే, ముందుగా పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత బార్ల ఏర్పాటు చేపట్టడం వల్ల సమస్యలు తలెత్తాయని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ సమస్యలకు త్వరిత పరిష్కారం కనుగొనాలని అధికారులను ఆదేశించారు. మద్యం సరఫరాలో పారదర్శకత, సమాన ధర విధానం తీసుకురావాలని కూడా సూచించారు.
రాష్ట్ర ఆదాయ వనరులను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి ఎర్రచందనం వినియోగంపై దృష్టి సారించారు. ఎర్రచందనం నుండి ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని విలువను సక్రమంగా వినియోగిస్తే లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తిరుపతి డిపోలోనే ఎర్రచందనంతో బొమ్మలు తయారు చేస్తే రాష్ట్రానికి అదనపు లాభం వస్తుందని సూచించారు. ఎర్రచందనం యొక్క పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధిలో రాష్ట్ర ఆదాయం స్పష్టంగా ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, ఆదాయార్జన శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే సమీక్షా సమావేశంలో ఫలితాలను ప్రదర్శించాలని ఆయన అధికారులకు గట్టి హెచ్చరిక ఇచ్చారు. రాష్ట్ర ఆదాయ వనరులను విస్తృత స్థాయిలో పెంచే దిశగా ముందడుగు వేయాలని, కొత్త మార్గాలు అన్వేషించాలని కూడా స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పలు విభాగాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి.